శ్రీశైలం జలాశయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా శ్రీశైలం నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు శ్రీశైల మల్లన్నకు పూజలు చేశానని ఆయన తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం రూ. 68 వేల కోట్లు ఖర్చు చేసిందని, పోలవరం ప్రాజెక్టు ద్వారానే రాయలసీమకు నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. సముద్రంలో కలిసే కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
హైలైట్:
- శ్రీశైలంలో పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- అనంతరం కృష్ణా నదికి జలహారతి చేపట్టిన సీఎం
- నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ కల్లా ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్ విధించానని, 30వ తేదీకి కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 68 వేల కోట్లు ఖర్చు చేశామని.. పోతిరెడ్డిపాడు, గాలేరు – నగిరి, గండికోట అన్నీ తమ హయాంలోనే వచ్చాయని చంద్రబాబు చెప్పారు.
సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదని, దాంతో రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి ఆలోచన చేశారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలనేదే తన లక్ష్యమన్నారు. రాయలసీమకు ఇప్పుడు నీళ్లు వస్తున్నాయంటే అది పోలవరం వల్లేనన్నారు. గతంలో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తిని ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉన్నామని.. ఇప్పుడు పాలిష్డ్ రైస్ తిని షుగర్ వ్యాధులు తెచ్చుకుంటున్నారని చెప్పారు. రాయలసీమలో అన్ని రకాల కూరగాయలు, పండ్లు పండుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.