
ఆరేళ్ల చిన్నారిని ఓ గుర్తుతెలియని మహిళ తీసుకెళ్లిన ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం వికారాబాద్లో బాలిక ఆచూకీని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కాచన్పల్లికి చెందిన రమేష్, లక్ష్మమ్మ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. అయితే లక్ష్మమ్మ ఇటీవల తమ పిల్లలను తీసుకొని పని నిమిత్తం శంషాబాద్కు వచ్చింది. ఆమె పిల్లలను బయటవదిలి ఓ షాప్లోకి వెళ్లిన క్రమంలో.. ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి ఆమే కూతురు కీర్తన(6)ను తీసుకెళ్లింది. ఇంతలో షాప్ నుంచి బయటకు వచ్చిన లక్ష్మమ్మకు కీర్తన కనిపించలేదు. దీంతో కంగారు పడిపోయి చుట్టుపక్కల వెతికింది. ఎంతవెతికినా చిన్నారి ఆచూకీ దొరకకపోవడంతో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు. చిన్నారిని తీసుకెళ్లిన మహిళను గుర్తించారు. ఆమెకోసం గాలింపు చేపట్టి.. ఎట్టకేలకు వికారాబాద్లో ఆమె ఆచూకీని కునుగొన్నారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ఆమె దగ్గర ఉన్న చిన్నారి కీర్తనను స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు చిన్నారిని పీఎస్కు తీసుకొచ్చి.. చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో పీఎస్కు వచ్చిన తల్లిదండ్రులు చిన్నారి కీర్తతను తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనపై చిన్నారి తీసుకెళ్లిన మహిళను విచారించగా మద్యం మత్తులో ఆమె కీర్తనను తీసుకెళ్లినట్టు పోలీసులకు తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.