
భార్యాభర్తలు.. ఇద్దరూ కలిసి పొలం వెళ్ళారు.. ఎంతకూ తిరిగి రాలేదు.. దీంతో ఏం జరిగిందోనని స్థానికులు పొలానికి వెళ్ళి చూశారు.. భార్య శవం కనిపించింది. భార్యని చంపి భర్త పారిపోయాడని అంతా భావించారు. కానీ.. మరుసటి రోజు షాకింగ్ సీన్ కనిపించింది.. భర్త కూడా శవమై కనిపించాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. పల్నాడు జిల్లా బొల్లాపల్లికి చెందిన వెంకటేశ్వర్లుకు మేళ్ళవాగుకు చెందిన క్రిష్ణ కుమారితో ఇరవై ఏళ్ళ క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. అన్యోన్య దాంపత్యంలో కొద్ది కాలం కిందట కలతలు ప్రారంభమయ్యాయి. తరుచూ ఇద్దరూ ఘర్షణ పడేవారు. అనుమానంతో వెంకటేశ్వర్లు.. క్రిష్ణ కుమారిని వేధించేవాడు. వేధింపులు తాళలేక కొన్ని నెలల క్రితం క్రిష్ణ కుమారి పుట్టింటికి వచ్చేసింది. తర్వాత వెంకటేశ్వర్లు కూడా మేళ్ళవాగులో ఉంటున్న భార్య వద్దకే వచ్చేశాడు. అత్తింటి వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామం మారిన వెంకటేశ్వర్లు ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్య పై అతనికి అనుమానం తీరలేదు.
ఈ క్రమంలోనే సోమవారం భార్యాభర్తలిద్దరూ పొలం వెళ్ళారు. ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో కొంత మంది వెళ్ళి చూడగా చెట్టు కింద క్రిష్ణ కుమారి శవమై కనిపించింది. ముఖంపై గాట్లు ఉన్నాయి. వెంకటేశ్వర్లు కనిపించలేదు. దీంతో అతనే చంపి పారిపోయి ఉంటాడని స్థానికులు భావించారు. పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేశ్వర్లు కోసం గాలింపు చేపట్టారు.
అయితే క్రిష్ణ కుమారి చనిపోయి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వెంకటేశ్వర్లు చెట్టుకి ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యను చంపినందుకు శిక్ష తప్పదని భావించి వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుకుంటున్నారు. వినుకొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..