ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల బండారం బట్టబయలు కాబోతోంది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసుల ఆధారంగా ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. మంచులక్ష్మి, రానా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్రాజ్, అనన్య నాగళ్ల సహా మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో PMLA కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ప్రముఖుల స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది. వీరంతా PMLA నిబంధనలు ఉల్లగించి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది.
నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. దీనిపై సిట్ను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. లెటెస్ట్గా ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ అవడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయనుంది.
యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు..యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్ చేయిస్తున్నారు. దీని కోసం వారికి లక్షల్లో, కోట్లల్లో చెల్లిస్తున్నారు. అయితే యాప్ ప్రమోషన్కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు సెలబ్రెటీలు వారు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్మీడియా యాప్స్లో సర్క్యులేట్ చేస్తున్నారు. వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి.
ఈజీమనీ వేటలో అనేకమంది బెట్టింగ్కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్లకు తగలేస్తున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రోజుకూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలామంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. చివరకు లక్షల్లో కనిపిస్తున్న అప్పులను తీర్చే మార్గం కనిపించక..మరోవైపు సొంతవారికి ముఖం చూపించ లేక..బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తెలుగురాష్ట్రాల్లో రోజుకో చోట వినిపిస్తున్న ఈ బెట్టింగ్ మరణాలు..అందర్నీ కలచివేస్తోన్నాయి. బెట్టింగ్ యాప్ దారుణాలపై భారీ యుద్ధమే చేసింది టీవీ9. దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం..బెట్టింగ్ యాప్స్తో పాటు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు మొదలు పెట్టింది. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ కూడా ఎంటర్ అవడంతో బెట్టింగ్ ప్రమోటర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది..