అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తన పని మొదలు పెట్టారు. వివిధ పరిశోధనలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. తాజాగా అంతరిక్షంలో ఖరీఫ్ సీజన్ వ్యవసాయం షురూ చేశారు. శుభాన్షు రైతుగా మారి సేద్యం చేస్తున్నారు. మెంతి, పెసర విత్తనాలు నాటారు. చిన్నపాటి గాజు పాత్రల్లో విత్తనాలు వేసి పెంచే పనిలో ఉన్నారు. జీరో గ్రావిటీ వాతావరణంలో ఈ మొక్కల పెరుగుదల ఎలా ఉంటుందోనన్న దానిపై ఆయన పరిశోధన చేస్తున్నారు.
ఐఎస్ఎస్లోని ప్రత్యేక స్టోరేజీ ఫ్రీజర్లో వాటిని ఉంచి అవి మొలకెత్తే విధానాన్ని ఫొటోలు తీశారు. ఈ పరిశోధనలో ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రవికుమార్ హోసమణి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ సిద్దపురెడ్డి అనే ఇద్దరు శాస్త్రవేత్తలు శుక్లాకు గైడ్ చేస్తున్నారు. యాత్ర ముగించుకుని భూమికి తిరిగి వచ్చాక.. ఈ మొలకల్లోని జన్యు మార్పులు, పోషక విలువలను విశ్లేషించనున్నట్లు యాక్సియం స్పేస్ సంస్థ వెల్లడించింది. వ్యవసాయ ప్రయోగాలతో పాటు మరిన్ని ముఖ్యమైన అధ్యయనాలు చేస్తున్నారు శుభాన్షు శుక్లా.
అంతరిక్షంలో జరుగుతున్న శాస్త్రీయ ప్రయోగాలపై శుభాన్షు చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. శుభాన్షు శుక్లా ఆక్సియం-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆక్సియం స్పేస్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ లూసీ లోవ్ బుధవారం ఆక్సియం-4 మిషన్లోని సిబ్బందితో సంభాషించారు. శుభాన్షు శుక్లా తాను చేస్తున్న శాస్త్రీయ ప్రయోగాల గురించి వివరించారు. తాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉన్నామని.. అంతరిక్ష కేంద్రంలో చాలా ప్రయోగాలు చేస్తున్నట్లు వివరించారు.