Pawan Kalyan Appreciate Inter Student EV Bicycle: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం విద్యార్థి సిద్ధూని కలిసి అభినందించారు. సిద్ధూ తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ తయారు చేయడంతో పవన్ కళ్యాణ్ ముగ్దులయ్యారు. స్వయంగా సైకిల్ నడిపి, లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేశారు. అంతేకాదు, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వివేక్ భదర్వాజ్, బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ కలయికల వెనుక ఆంతర్యం ఏమిటి?

‘విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రాజాపు సిద్ధూ అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అభినందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధూ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధూ రూపొందించిన సైకిల్ను స్వయంగా నడిపి తన ఆవిష్కరణలను పరిశీలించారు. అతని ఆలోచనలను మెచ్చుకుని భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలి అని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా లక్ష రూపాయలు అందించారు. అంతేకాకుండా సైకిల్పై సిద్ధూని కూర్చోబెట్టి స్వయంగా నడిపారు. విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ, కాలేజీకి వెళ్లేందుకు మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం గల ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను స్వయంగా తయారు చేశాడు. ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది’ అంటూ ట్వీట్ చేశారు.
‘కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భదర్వాజ్ బృందం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో SVAMITVA యోజన పథకంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు’ అని తెలిపారు. అలాగే ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.