Swachh Ratham Pilot project in Prathipadu: స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం స్ఫూర్తిని పల్లెలకు సైతం విస్తరింపజేసేందుకు కొత్త ఆలోచన చేసింది. అందులో భాగంగా స్వచ్ఛ రథం కార్యక్రమానికి ఏపీ పంచాయతీరాజ్ శాఖ శ్రీకారం చుట్టింది. గుంటూరు గ్రామీణం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. స్వచ్ఛ రథం వద్ద చెత్త అందించిన వారికి.. ఆ చెత్తకు సమానమైన నిత్యావసర సరుకులను ఉచితంగా అందిస్తారు.

అందులో భాగంగా స్వచ్ఛ రథాలను తీసుకువచ్చారు. ఈ స్వచ్ఛ రథం ద్వారా పల్లె ప్రాంతాల్లో చెత్త, వ్యర్థాలను సేకరిస్తారు. ప్రజలు ఎంతమేర చెత్త, వ్యర్థాలను తీసుకువచ్చారో లెక్కగట్టి.. అందుకు సమానంగా 20 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని తొలుత గుంటూరు గ్రామీణ మండలంలో అమలు చేస్తున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జెడ్పీ ఛైర్పర్సన్ హెని క్రిస్టినా గుంటూరు గ్రామీణ మండలం లాలుపురం పంచాయతీలో వీటిని ప్రారంభించారు.
స్వచ్ఛ రథం కాన్సెప్టులో భాగంగా.. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ స్వచ్ఛ రథం మండలంలోని అన్ని గ్రామాలను చుట్టివస్తుంది. స్వచ్చ రథం ఇంటి వద్దకు వచ్చిన సమయంలో ప్రజలు తమ ఇళ్లల్లోని తడి, పొడి చెత్తను వాటికి కేటాయించిన డబ్బాలలో వేయాలి. ఆ వ్యర్థాల బరువును లెక్కగట్టి వాటికి సమానమైన నిత్యావసరాలు ఉచితంగా అందిస్తారు. చెత్త, వ్యర్థాల రకాన్ని అనుసరించి కిలోకి రూ. 16 నుంచి రూ. 20 వరకు లెక్కించనున్నారు. ఎన్ని కిలోలు బరువు తూగితే.. ఆ లెక్కన లెక్కగట్టి అందుకు సమానంగా నిత్యావసర వస్తువులు అందిస్తారు. గాజు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు, పాత పేపర్లు, ప్యాకెట్లు, కవర్లు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వంటి వాటిని స్వచ్ఛరథం సిబ్బందికి అందించి.. నిత్యావసరాలు తీసుకోవచ్చు.పల్లెలలో కూడా స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఈ సరికొత్త ఆలోచన చేసింది.