తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన వారికి పదవులివ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క. బిజెపి అధిష్టానం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్నారు. 2016 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో దళిత బిడ్డ వేముల రోహిత్ ఆత్మహత్య వంటి సంఘటనలు పునరావృతం కాకుండా త్వరలో తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తద్వారా దళితులు, గిరిజనులు, తమ వెనుకబడిన వర్గాలకు సమాన హక్కులు ఉండాలని కోరుకునే వారికి రక్షణ కల్పిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. రోహిత్ వేముల కేసును తాము పునర్విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. రోహిత్ వేముల మృతికి కారకులైనవారిని ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు.
అయితే రోహిత్ ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి బీజేపీ పెద్ద పీఠ వేసి, ఉన్నతమైన పదవులను కట్టబెట్టిందని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషం ఒక తాడును కూడా ఇస్తే ఉరి వేసుకోవడానికి పనికొస్తుందని రోహిత్ వేముల వీసీకి రాసిన సూసైడ్ నోట్లో ఉంది. అప్పట్లో ఈ సూసైడ్ నోట్ దేశ ప్రజల మనసులను కలచివేసింది. అని డిప్యూటీ సీఎం వివరించారు. హెచ్ సీయూలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ వర్సిటీ విసీకి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వినతి పత్రాన్ని ఇచ్చారన్నారు.
ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని హెచ్ సీయూ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ రోహిత్ వేములతో పాటు అసోసియేషన్ లోని మరో నలుగురు సభ్యులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వీసీకి కంప్లైంట్ చేశారన్నారు. ఆ నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని వీసీపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ నుంచి వీసీపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో యూనియన్ సభ్యులపై పోలీసు కేసులు నమోదు చేశారన్నారు. నలుమూలల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక వర్సిటీ అధికారులు రోహిత్ వేములతో పాటు మరో నలుగురిని రెస్ట్ గేట్ చేయడంతో మరో మార్గం లేక రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారని భట్టి విక్రమార్క వివరించారు.
ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి, మరొకరి ఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్
పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రామచంద్రరావును ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారని అలాగే రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న సుశీల్ కుమార్ను ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి కట్టబెట్టిందని మండిపడ్డారు. దళితులు గిరిజనులను ఇబ్బంది పెట్టి వారు మరణం అంచుల దాకా వెళ్లేలా టార్గెట్ చేసే వారికి బీజేపీ నాయకత్వం పదవులు ప్రోత్సాహకాలు ఇచ్చి తమ మార్క్ను చూపించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బిడ్డలపై చూపుతోన్న వివక్షకు బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పవర్ షేరింగ్ లేదు..
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం బాగానే ఉందని, అందరు కలిసి టీం వర్క్ తో పని చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పవర్ షేరింగ్ అంటూ ఏమి లేదని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ భవన్ శబరి బ్లాక్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బీర్ఎస్ నేతల మాటలు మితిమీరి పోయాయని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో, వారి నిర్ణయం ఏంటో తెలియదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల హామీలను సూచా తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. 100 శాతం రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు.
రైతు భరోసా ఇచ్చామని , ఆరోగ్య శ్రీ రూ. 10 లక్షలకు పెంచామని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి పేదింటికి సన్న బియ్యం అందుతున్నాయన్నారు. ఫోర్త్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని, మూసి సుందరీకరణ ఈ ప్రభుత్వం హయంలో పూర్తి అవుతుందన్నారు. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుందన్నారు. పాశమైలారం సిగాచి ప్రమాదం పై విచారణ కు ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఖర్గే, కేసి వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి