KL Rahul : ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో అతను ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. లార్డ్స్ మైదానంలో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ సిరీస్ ప్రారంభంలో రాహుల్ ఫామ్పై చాలా అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు అతను వాటికి తన బ్యాట్తో సమాధానం చెప్పాడు. ఈ ఇన్నింగ్స్లో రాహుల్ ఎటువంటి తొందరపాటు లేకుండా చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ టెస్ట్ సిరీస్లో ఇది అతనికి రెండో సెంచరీ, అతని కెరీర్లో మొత్తం 10వ సెంచరీ. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్తో కలిసి 141 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి, జట్టుకు భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు.
ఈ టెస్ట్కు కొన్ని రోజుల ముందు మాజీ ఆటగాడు చతేశ్వర్ పుజారాను కలుసుకుని ఇంగ్లాండ్ పర్యటనలో తన టార్గెట్లను షేర్ చేసుకున్నాడు. స్టార్టింగ్ నుంచే బాగా ఆడి సెంచరీలు సాధించాలని అనుకున్నట్లు తెలిపారు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో రాహుల్ 26, 77, 37, 7, 84, 4*, 24, 0, 4, 13లను మాత్రమే సాధించాడు. కానీ ఇంగ్లాండ్ పర్యటనలో అతని స్కోర్లు: 42, 137, 2, 55, 100. గత 5 టెస్టుల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు చేసిన రాహుల్, ఇప్పుడు ఇంగ్లాండ్లో రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు అతను మంచి ఇన్నింగ్స్లు ఆడుతూ తన సత్తాను నిరూపించుకున్నాడు.
గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ముందు ‘కేఎల్’గా ఉన్న రాహుల్,ప్రస్తుతం జట్టుకు’పెద్దన్న’గా మారిపోయాడు. భారత క్రికెట్లో ఇలా భాయ్ అని పిలవడం ఒక బాధ్యతతో కూడుకున్న విషయం. రాహుల్ రోహిత్ లేదా విరాట్ లాంటివాడు కాదు. అతను ద్రవిడ్ తరహా ఆటగాడు. 2025లో రాహుల్కు జీవితాంతం గుర్తుండిపోతుంది.ఈ మార్చిలో తను తండ్రయ్యాడు. ఐపీఎల్లో రాణించాడు.. ఇప్పుడు ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్ బ్యాటింగులో ఇరగదీస్తున్నాడు.
A second appearance on the Lord’s Honours Board for @klrahul 💯 pic.twitter.com/faRiHxkVJg
— Lord’s Cricket Ground (@HomeOfCricket) July 12, 2025
ఈ టెస్ట్ జరుగుతున్న లార్డ్స్ పిచ్పై పరుగులు చేయడం కష్టంగా మారింది. ఈ పిచ్పై పరుగులు చేయగల భారత బ్యాట్స్మెన్ రాహుల్ ఒక్కడేనని అంతా అంటున్నారు. ప్రతి సెషన్లో తన స్వభావాన్ని మార్చుకునే పిచ్పై ఆడేందుకు అవసరమైన టాలెంట్ రాహుల్కు ఉంది. లంచ్ విరామానికి ముందు పంత్ తన పార్టనర్ సెంచరీ పూర్తయ్యేందుకు సహాయం చేయాలనుకున్నాడు. చివరి ఓవర్లో ఒకే పరుగు తీయాలని పంత్ పిలిచాడు. అది తప్పుడు నిర్ణయంగా మారి పంత్ రనౌట్ అయ్యాడు. పంత్ రనౌట్ అయినప్పుడు రాహుల్ 98 పరుగుల వద్ద ఉన్నాడు. రెండో సెషన్లో రాహుల్ తన సెంచరీని పూర్తి చేశాడు.. కానీ వెంటనే అవుట్ అయ్యాడు.
177 బంతులు ఆడిన రాహుల్ జట్టు కోసం తన వంతు కృషి చేశాడు. గతంలో ఉన్న ఫామ్ నుంచి ప్రస్తుతం మంచి ఫామ్ లోకి తిరిగి వచ్చాడు.ఈ ఐపీఎల్లో కేఎల్ రాహుల్ తన పాత జట్టు యజమాని సంజీవ్ గోయెంకాను కలిసినప్పుడు తను ఎటువంటి భావోద్వేగాలు లేకుండా ప్రవర్తించాడు. ఈ విషయం రాహుల్లో వచ్చిన మార్పును, అతను ఎంత ప్రశాంతంగా, నిలకడగా ఉన్నాడో చూపిస్తుంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..