ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే, ఆయన మరణానంతరం, హిందూయిజంపై కోటా శ్రీనివాసరావు చేసిన ఒక పవర్ఫుల్ ప్రసంగం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన హిందూయిజం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ఇంతకీ ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు? ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది అనే వివరాలు తెలియాలంటే ఇది చదవండి
హైలైట్:
- హిందూయిజంపై కోటా పవర్ఫుల్ స్పీచ్
- ఐదేళ్ల నాటి వీడియో ఇప్పుడు వైరల్
- కోటా స్పీచ్పై ప్రశంసలు

ఈ వీడియోలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం అనవసరంగా హిందూయిజం మీద రాద్ధాంతం చేస్తుంది. అసలు ఇంత హడావుడి చేయడం అనవసరం అని నా ఉద్దేశం. అమ్మను అమ్మా అని పిలవడం తప్పా. మనం మన కన్నతల్లిని అమ్మా అని పిలుచుకుంటున్నాం. అంతే తప్ప.. వాళ్ల మాదిరి అమ్మను అమ్మా అని పిలివడానికి సిగ్గుపడి.. అలా పిలిపించుకోవడానికి తల్లులు కూడా సిగ్గుపడి.. మమ్మీ అని పిలిపించుకునే సంస్కారం మనది కాదు కదా. అసలేంటి హిందూత్వం.. ఎందుకు దీని మీద ఇంత వివాదం నాకు అర్థం కావడం లేదు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘ముందు మీర ఒక్క అంశాన్ని గుర్తించండి. ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఇండియా అంటాయి. కానీ మన ఆగర్భ శత్రువు పాకిస్థాన్ మాత్రం.. మైకులు ముందు కూర్చుని హిందూస్థాన్ మే అంటుంది. మన చిరకాల శత్రువే మనది హిందూ దేశం అని ఒప్పుకుంటుంది. ఇంకా ఎందుకు దీని గురించి అనవసర వివాదాలు, రాద్ధాంతం. ఇలా చేసే వాళ్లు పిచ్చోళ్లు.. వాళ్లవి పిచ్చి మాటలు. పైగా హిందూయిజం నశించాలి.. హిందూయిజం, ఉగ్రవాదం అనే వాళ్లంతా పైన పరిపాలిస్తూ.. తమ ప్రసంగం పూర్తయ్యాక చివర్లో జైహింద్ అంటారు. అదేంటో అర్థం కాదు. హిందూయిజాన్ని వ్యతిరేకించే వారు మళ్లీ జైహింద్ అనడం ఏంటో’’ అంటూ కోట సెటైర్లు వేశారు.
ఇక ఈ వీడియో ఐదు సంవత్సరాల క్రితం నాటిది అని తెలుస్తోంది. అయితే ఆయన ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారో తెలియాదు. కానీ ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. హిందూయిజానికి పర్ఫెక్ట్ మీనింగ్ చెప్పారు సార్ అంటూ కామెంట్ చేస్తున్నారు.