తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త శ్రీనివాసులు హత్య కలకలం రేపింది. ఈ కేసులో జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాయుడు గతంలో వినుత వద్ద డ్రైవర్గా పనిచేయగా, హత్యకు బొజ్జల సుధీర్ రెడ్డి కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వినుత కోటను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు పార్టీ కన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు.
హైలైట్:
- రాయుడు హత్య కేసులో కీలక పరిణామం
- టీడీపీ ఎమ్మెల్యేపై కోట వినుత సంచలన ఆరోపణలు
- అతడి వల్లే ఇదంతా అంటూ కామెంట్స్

పోలీసులు కోట వినుత, చంద్రబాబు, మిగిలిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో వినుత కోట మీడియాతో మాట్లాడుతూ, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుంది అని అన్నారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు కోట వినుత.. ఉన్నారు అని ఆమె సమాధానం ఇచ్చారు. చంద్రబాబు కల్పించుకుని, ఈ వ్యవహారంలో బొజ్జల సుధీర్ రెడ్డి (టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఉన్నాడని ఆరోపించారు.
ఈ హత్య కేసు ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వినుత కోటను పార్టీ నుండి బహిష్కరించినట్లు ప్రకటించింది. పార్టీ కన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. కొంతకాలంగా వినుత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, ఆమె ప్రవర్తన పార్టీ నియమాలకు విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. వినుతపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఆమెను పార్టీ నుండి తొలగించామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే 20 రోజుల క్రితం అనగా జూన్ 21వ తేదీన వినుత ఓ బహిరంగ ప్రకటన చేశారని.. రాయుడు చేసిన ద్రోహానికి తనని విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా మీడియా, సోషల్ మీడియాలో యాడ్ ఇచ్చారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇంతలోనే రాయుడు శవమై కనిపించడం.. ఈ కేసులో వినుతను చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాయుడు హత్య కేసును చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది.