పంటపొలాల్లో వెండి నాణేలు బయటపడటంతో హర్యాణా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లా లాడ్వా సమీపంలోని నివార్సీ గ్రామంలో కోలాహలం నెలకుంది. రహదారి నిర్మాణ పనుల కోసం సమీపంలోని ఓ పురాతన దేవాలయం స్థలంలో తవ్విన మట్టిని తీసుకొచ్చి పొలాల పక్కన వేశారు. అదే మట్టిని వరిపొలాల పక్కన ఉంచగా… అందులోంచే నాణేలు బయటపడ్డాయి. ఈ ఘటన గ్రామస్థులకే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకూ ఆశ్చర్యం కలిగించింది. అక్కడి మట్టిలో 1905 సంవత్సరానికి చెందిన వెండి నాణేలు బయటపడ్డాయి. రాజిని అనే మహిళకు నాలుగు నాణేలు దొరికాయి. మరోవైపు చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తవ్వకాల్లో పాల్గొంటున్నారు.
స్థానికుల అంచనా ప్రకారం ఇప్పటివరకు కనీసం 2 కిలోల వెండి నాణేలు దొరికినట్టు తెలుస్తోంది. ఇంకా నాణేలు దొరకవచ్చన్న ఆశతో గ్రామస్తులు అక్కడ వెతుకులాట కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయంపై జిల్లా పాలనా యంత్రాగానికి సమాచారం లేదని లాడ్వా నాయబ్ తహసీల్దార్ బల్కర్ సింగ్ తెలిపారు. “మాకు ఎవరి నుంచి సమాచారం రాలేదు, పురావస్తు శాఖకూ ఎలాంటి సమాచారం లేదు” అని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..