తమిళనాడు మడపురంలో కొద్దిరోజుల క్రితం పోలీసుల చిత్రహింసలతో అజిత్కుమార్ అనే ఓ వ్యక్తి మరణించారు. సంచలనం రేపిన ఈ కేసుతో గతంలో జరిగిన లాకప్డెత్లు తెరపైకి రావడం తమిళ్ పాలిటిక్స్ను వేడెక్కిస్తున్నాయి. ప్రధానంగా.. నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెంట్రి కళగం పార్టీ.. లాకప్ డెత్లపై పోరు సాగిస్తోంది. అజిత్కుమార్ లాకప్డెత్ నేపథ్యంలో పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి టీవీకే అధినేత విజయ్ రోడ్డె్క్కారు. చెన్నైలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. గతంలో పోలీసు కస్టడీల్లో మృతి చెందినవారి కుటుంబాలను టీవీకే పార్టీ తరపున విజయ్ పరామర్శించారు. ఈ క్రమంలోనే.. లాకప్ డెత్లను వ్యతిరేకిస్తూ చెన్నైలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల చొక్కా ధరించి.. ధర్నాలో పాల్గొన్న విజయ్.. సారీ కాదు.. న్యాయం కావాలంటూ ప్లకార్డు ప్రదర్శించారు. పోలీసు కస్టడీలో మరణించిన అజిత్కుమార్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు విజయ్.
లాకప్ డెత్ల విషయంలో స్టాలిన్ సర్కార్పై టీవీకే అధినేత విజయ్ విరుచుకుపడ్డారు. అజిత్కుమార్ కస్టడీ మృతికి సంబంధించి సీఎం స్టాలిన్ సారీ చెప్పడంపై మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి కావాల్సింది సారీ కాదు.. న్యాయం కావాలని డిమాండ్ చేశారు. లాకప్ డెత్లపై కోర్టులు జోక్యం చేసుకుని ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని విజయ్ నిలదీశారు.
ఇక.. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని మడపురం భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ఇద్దరు మహిళా భక్తుల నగలు చోరీ అయ్యాయి. ఈ కేసులో ఆ ఆలయ సెక్యూరిటీ గార్డుగా ఉన్న అజిత్కుమార్తోపాటు పలువుర్ని పోలీసులు విచారించారు. పోలీసు కస్టడీలో ఉన్న అజిత్ ప్రాణాలు కోల్పోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లే.. అజిత్ ఒంటిపై 44 గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో వెల్లడి కావడం సంచలనం సృష్టించింది. పోలీసుల చిత్రహింసలతోనే ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ అజిత్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో.. లాకప్ డెత్లపై విజయ్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టి.. ఆయా బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. లాకప్ డెత్లను వ్యతిరేకిస్తూ టీవీకే తరపున తొలిసారి చెన్నైలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి తమిళనాడు పాలిటిక్స్లో ఒక్కసారిగా హీట్ పెంచారు.