దేశ రాజధాని ఢిల్లీలో త్రిపురకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థిని మిస్సైన ఏడు రోజుల తర్వాత ఎట్టకేలకు ఢిల్లీ ఫ్లైఓవర్ కింద ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ్ సనాతన ధర్మ కళాశాలలో చదువుతున్న స్నేహ దేబ్నాథ్ జులై 7 నుంచి కనిపించకుండా పోయింది. ఆ రోజు ఉదయం 5:56 గంటలకు ఆమె తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడింది. తన స్నేహితురాలు పిటునియాతో కలిసి సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్కు వెళ్తున్నట్లు తెలిపింది. అయితే ఆరోజు ఆమె పిటునియాను కలవలేదు.స్నేహ ఫోన్ జులై 7 ఉదయం 8:45 గంటల నుంచి స్విచ్ ఆఫ్లో ఉంది.
అయితే జులై 13, 2025న ఆమె గదిలో ఒక చేతితో రాసిన నోట్ లభించింది. అందులో నేను వైఫల్యంగా, భారంగా భావిస్తున్నాను. ఇలా జీవించడం అసహనీయంగా మారింది అని రాసి ఉంది. అయితే, ఆమె సోదరి బిపాషా దేబ్నాథ్ ఈ నోట్పై అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి వివరాలు లేకుండా నోట్ ఉందని పేర్కొంది. చివరిగా ఒక క్యాబ్ డ్రైవర్ ఆమెను ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ సమీపంలో దింపినట్లు ధృవీకరించాడు. ఢిల్లీ పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), త్రిపుర పోలీసులు సిగ్నేచర్ బ్రిడ్జ్ చుట్టూ 7 కిలోమీటర్ల వ్యాసార్థంలో, యమునా నది పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, సీసీటీవీ కవరేజ్ లేకపోవడంతో గాలింపు ప్రక్రియలో వారికి అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా అధికారులు వెనకాడలేదు.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఢిల్లీ బ్రిడ్జ్ కింద స్నేహి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఇక ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్నేహ ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
స్నేహ మిస్సింగ్ పై రంగం లోకి దిగిన త్రిపుర సీఎం
మరోవైపు స్నేహ మిస్సింగ్ వ్యవహారంపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా జోక్యం చేసుకుని, వెంటనే పోలీసు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. స్నేహ తండ్రి, రిటైర్డ్ సుబేదార్ మేజర్, డయాలసిస్లో ఉన్నారు. కుటుంబం అదృశ్యం ఫిర్యాదు ఆలస్యంగా నమోదు చేయడంపై, సరైన నిఘా లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..