మహారాష్ట్ర ప్రభుత్వం రాబోయే శీతాకాల శాసనసభ సమావేశాల్లో మత మార్పిడులను నిరోధించడానికి కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. హోం శాఖ సహాయ మంత్రి (గ్రామీణ) పంకజ్ భోయార్ సోమవారం శాసన మండలిలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతిపాదిత చట్టంలో ఇతర రాష్ట్రాలలోని ఇలాంటి చట్టాలలో ఉన్న నిబంధనల కంటే కఠినమైన నిబంధనలు ఉంటాయని ఆయన అన్నారు. ఒకసారి అమలులోకి వస్తే మన దేశంలో ఇటువంటి చట్టాన్ని అమలు చేసిన 11వ రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరిస్తుంది.
“మత మార్పిడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని రూపొందించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇది మిగతా 10 రాష్ట్రాల కంటే కఠినంగా ఉంటుంది. ఈ అంశంపై DGP రూపొందించిన నివేదిక సమర్పించారు. రాబోయే (శీతాకాల) సమావేశాల్లో ఈ చట్టం ఆమోదం పొందుతుంది అని భోయార్ సభకు తెలిపారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు సాధారణంగా డిసెంబర్లో మహారాష్ట్ర రెండవ రాజధాని నాగ్పూర్లో జరుగుతాయి.
మతమార్పిడి నిరోధక చట్టం ఉన్న 10 రాష్ట్రాలు ఇవే..
- రాజస్థాన్
- ఉత్తర ప్రదేశ్
- మధ్యప్రదేశ్
- ఒడిశా
- ఆంధ్రప్రదేశ్
- ఛత్తీస్గఢ్
- గుజరాత్
- హిమాచల్ ప్రదేశ్
- జార్ఖండ్
- ఉత్తరాఖండ్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి