పహల్గామ్ దాడికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’-TRFను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బైరసన్ వ్యాలీలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీశారు. తర్వాత అడవుల్లోకి పారిపోయారు.ప్రపంచమంతా ఈ దాడిని ఖండించింది. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్పై దాడులు చేపట్టి ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసింది.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘లష్కరే తయిబా’ ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ అని అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ‘‘మా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గామ్ దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇదే మా పరిపాలన నిబద్ధతను చెబుతోంది’’ అని రూబియో తెలిపారు. ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ను విదేశీ ఉగ్రవాద సంస్థగా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అమెరికా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.
2008 ముంబయి ఉగ్రదాడి తర్వాత భారత్లో చోటుచేసుకున్న దాడుల్లో పహల్గామ్ ఘటనే అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్క్ రూబియో వెల్లడించారు. భారత భద్రత దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని పేర్కొన్నారు.