Andhra Pradesh Creator Academy: ఏపీలో మరో ప్రతిష్టా్త్మక సంస్థ కొలువుదీరనుంది. ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో.. టెజరాక్ట్, యూట్యూబ్లతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది.

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం యూట్యూబ్, టెజరాక్ట్ కలిసి.. క్రియేటర్ అకాడమీ ఏర్పాటు చేస్తాయి. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. “సింగపూర్ పర్యటనలో మూడో రోజు ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. షాంగ్రీలా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో టెజారాక్ట్, US Inc. ప్రెసిడెంట్ తేజ ధర్మ, వైస్ ప్రెసిడెంట్ – APAC గౌతమ్ ఆనంద్, ఏపీ ప్రభుత్వం ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనుంది. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
మరోవైపు సింగపూర్ పర్యటనలో క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాతోనూ నారా లోకేష్ భేటీ అయ్యారు. అమరావతి, విశాఖపట్నం వంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలను అమలు చేయడానికి క్యారియర్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని కోరారు. అలాగే ఏపీలోని టైర్-2, టైర్-3 నగరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఆహార నిల్వల కోసం కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై క్యారియర్ సంస్థ సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిందని నారా లోకేష్ వెల్లడించారు.
అలాగే ఎస్టీ టెలీమీడియా ఇన్వెస్ట్మెంట్స్ (ఇండియా) ప్రతినిధులతో భేటీ అయిన నారా లోకేష్.. విశాఖపట్నంలో ఎస్.టి. టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మురాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ హిరోయికి నివాతో భేటీ అయిన లోకేష్.. ఏపీలో మురాటా ఎలక్ట్రానిక్స్ అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీ ద్వారా ప్రత్యేక క్లస్టర్లలో సంబంధిత యూనిట్ల ఏర్పాటుపై ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాన్ని వారికి వివరించారు. అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ పరికరాల తయారీకి మద్దతు ఇచ్చే అనుబంధ యూనిట్లను ఏర్పాటుచేయాలని నారా లోకేష్ కోరారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.