దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో ఈ నూతన పథకాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 1న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్న కార్మికులకే కాదు, వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పథకం రెండు సంవత్సరాలపాటు అమలులో ఉండనుంది. నూతన ఎంప్లాయిస్కు అలాగే ఎంప్లాయర్స్కు లబ్ధి కలిగేలా పథకాన్ని రూపకల్పన చేశారు. నెలకు 1 లక్షలోపు ఆదాయం ఉన్న ఉద్యోగులు, కార్మికులు ఈ పథకానికి అర్హులు.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ కు ఆమోదం తెలిపింది. దీనికోసం 99,446 కోట్ల బడ్జెట్తో రెండు సంవత్సరాల్లో మూడున్నర కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు రెండు కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగాల్లో చేరనున్నారు. ఈ కొత్త స్కీం ఆగస్టు ఒకటి 2025 నుండి జూలై 31 2027 మధ్య ఎంపిక కాబడే ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈపీఎఫ్ లో రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు రూ. 15,000 కేంద్రం జమ చేస్తుంది. రెండు విడుదలుగా 15 వేలను బెనిఫిషరీ అకౌంట్లో జమ చేస్తామని అధికారులు తెలుపుతున్నారు
ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉద్యోగ కల్పనకు గట్టి బలం చేకూరుతుంది. కొత్తగా ఏర్పడుతున్న కంపెనీలు అనుభవజ్ఞులైన కార్మికులతో పాటు కొత్త కార్మికులను కూడా నియమించేందుకు ప్రోత్సహించబడతాయి అని తెలిపారు సంగారెడ్డి ఈపీఎఫ్ రీజనల్ మేనేజర్ విశాల్ అగర్వాల్.ఈ పథకం ముఖ్యంగా SME రంగాన్ని, స్టార్టప్లను లబ్ధిపరిచేలా రూపొందించబడింది. ఉద్యోగ కల్పనతో పాటు సామాజిక భద్రతను కూడ పటిష్టం చేయాలన్నదే లక్ష్యం అని వివరించారు. ఆగస్ట్ నుండి అమలులోకి రానున్న ఈ పథకం దేశంలో నూతన ఉపాధి అవకాశాలను ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక పాత్ర పోషించనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.