Andhra Pradesh Senior Citizen Card Apply: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి జారీ చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డులకు సంబంధించి ఫీజు మినహాయించారు. ఇకపై ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. ఉచితంగానే కార్డుల్ని జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లు ఈ విషయాన్ని గమనించి కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటికే పలువురు ఈ కార్డుల్ని తీసుకున్నారు.
హైలైట్:
- ఏపీలో సీనియర్ సిటిజన్లకు తీపికబురు
- సీనియర్ సిటిజన్ కార్డులు ఉచితంగానే
- ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం

ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న రోజే పది, 15 నిమిషాల్లో ఇస్తారు. సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ కార్డుతో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు టికెట్లో 25 శాతం రాయితీ లభిస్తుంది. అలాగే దూరం వెళ్లే బస్సులు కాకుండా ప్రతి ఆర్టీసీ బస్సులో రెండు సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ చేస్తారు. రైల్వే స్టేషన్లలో వీరికి ప్రత్యేకంగా కౌంటర్లు.. వీల్ఛైర్ల సదుపాయం, లోయర్ బెర్త్ల కేటాయింపులో ప్రాధాన్యత, రైలులలో ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్త్లు, థర్డ్ ఏసీలో నాలుగు బెర్త్లు, సెకండ్ ఏసీలో మూడు బెర్త్లు సీనియర్ సిటిజన్లకు (ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి) కేటాయిస్తారు.
వీడియో: చీపురు పట్టి చెత్త ఊడ్చిన సీఎం చంద్రబాబు
సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్న వారికి కొత్త పాస్పోర్టు కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో 10 శాతం తగ్గింపు ఉంది. అలాగే వీరికి సంబంధించిన కేసుల విచారణకు కోర్టుల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఈ కేసులకు పిటిషనర్లు కోరితే ప్రత్యేకంగా విచారణ తేదీలు కేటాయిస్తారు. బ్యాంకుల్లో కూడా వీరికి ప్రత్యేకంగా క్యూ లైన్ కౌంటర్ ఉంటుంది.. సర్వీసుల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. 60-79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 0.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అదే 80 ఏళ్లుపైబడిన వారికి అయితే 1% వడ్డీ రేటు లభిస్తుంది. వీటితో పాటు మరికొన్ని ఉపయోగలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో అడిగితే ఆ వివరాలు చెబుతారు. అలాగే సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్నవారికి ఆదాయ పన్ను విషయంలోనూ మినహాయింపులు ఉన్నాయి.