హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో సందడి చేశారు. పార్లమెంట్ ఆవరణలో సైకిల్పై విహరిస్తూ కనిపించారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్ లాల్ ఖట్టర్లను కలిసి హిందూపురం అభివృద్ధికి విజ్ఞప్తులు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పేరుతో జరుగుతున్న మోసపూరిత విరాళాల సేకరణపై ఆయన స్పందించారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హైలైట్:
- ఢిల్లీలోని పార్లమెంట్కు ఎమ్మెల్యే బాలకృష్ణ
- కేంద్ర మంత్రులను కలిసి హిందూపురం ఎమ్మెల్యే
- టీడీపీ ఎంపీపై సైకిల్పై కూర్చున్న బాలయ్య

కేంద్ర మంత్రులను కలిసే ముందు పార్లమెంట్ ఆవరణలో ఉన్న నందమూరి బాలకృష్ణకు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన సైకిల్ చూయించారు. పార్లమెంట్ సమావేశాలకు తాను రోజూ ఇదే సైకిల్పై వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. దాంతో తమ పార్టీ సింబల్ అయిన సైకిల్పై బాలయ్య సరదాగా కూర్చొని ఫొటోకి పోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హిందూపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ నిలిచారు. 2014లో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన బాలయ్య.. 2019, 2024లో అక్కడ నుంచి గెలిచారు. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే, మరోవైపు తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. హిందూపురాన్ని అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరిన బాలయ్య.. ఇప్పుడు కేంద్రమంత్రులను కలిసి నిధులు విడుదల చేయాలని విన్నవించారు.
తాజాగా బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్ పేరుతో తనకు తెలియకుండానే విరాళాలు సేకరించబోతున్నారనే సమాచారం రావడంతో నందమూరి బాలకృష్ణ స్పందించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఛైర్మన్గా ఉన్న ఆయన ఈ ఈవెంట్కు ఎలాంటి అధికారిక అనుమతి లేదంటూ స్పష్టం చేశారు. అశ్విన్ అట్లూరి పేరిట వచ్చిన మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు తెలియజేశారు.