వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో తదుపరి దర్యాప్తు పేరుతో మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేయడానికి వీలులేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణకు అనుమతి ఇస్తూ రాజమహేంద్రవరం ఎస్సి, ఎస్టి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అనంతబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, లేకపోతే మొదటి నుంచి దర్యాప్తు చేసే అవకాశం ఉందని పిటిషన్లో అనంతబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారి పునర్ దర్యాప్తు మొదలుపెట్టి వేధించే అవకాశం ఉందని అనంతబాబు తరుపు సీనియర్ న్యాయవాది చిత్తరవు రఘు వాదించారు. ఆయన పిటిషన్పై విచారణ చేసిన కోర్టు కీలక ఆదేశాలు వెల్లడించింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో కేవలం విచారణ తదుపరి దర్యాప్తునకే పరిమితం కావాలని, మొదటి నుంచి చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దర్యాప్తు అధికారికి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు స్టేకు నిరాకరించడంతో పునర్ విచారణకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది.
అనంతబాబు కేసులో ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ అధికారులు విచారమ ప్రారంభించారు. అనంతబాబుకు సహకరించినవారిపై సిట్ ఫోకస్ చేసింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి హత్య కేసులో ఉన్న కుట్ర అంతా బయట పెట్టాలని అనుకుంటున్నారు. కేసు పూర్వాపరాలు తేల్చి, బాధితులకు న్యాయం చేసే విషయంలో సిట్ ఏ అవకాశాన్ని వదిలి పెట్టకూడదని భావిస్తోంది. 2022 మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారు. తానే హత్య చేసినట్లుగా అనంతబాబు అంగీకరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..