అల్లూరి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పింఛన్ సొమ్ము తీసుకువెళ్తున్న అధికారిపై దాడికి పాల్పడి సొమ్ముతో ఉడాయించారు. బైక్పై వెళుతున్న సచివాలయం ఉద్యోగిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో బెదిరించి నగదు అపహరించారు. ఈ ఘటన అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలంలోని రాయిపల్లిలో గురువారం(జూలై 31) జరిగింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పెదబయలు మండలం బొండాపల్లి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా కటారి మత్య్సరాజు విధులు నిర్వహిస్తున్నాడు. నెలవారి లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు చెల్లించడానికి పెదబయలు ఎస్బీఐ బ్రాంచి నుంచి రూ.17 లక్షల 53 వేల 200లు విత్డ్రా చేశాడు. డిజిటల్ అసిస్టెంట్కు రూ. లక్షా 47 వేల నగదు ఇచ్చి, మిగతా సొమ్ముతో స్వగ్రామమైన ముంచంగిపుట్టు మండలం కిలగాడ పంచాయతీ చెరువుపాకలకు టూవీలర్పై తీసుకువెళ్తున్నాడు. అయితే, మార్గమధ్యంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. కత్తులు, తుపాకీతో బెదిరించి మత్య్సరాజు నుంచి నగదు లాక్కుని ద్విచక్ర వాహనంపై పారిపోయారు.
అదే సమయంలో అటుగా ద్విచక్రవాహనంపై వస్తున్న సీతగుంట పంచాయతీ సెక్రటరీ లక్ష్మణరావుకు విషయం చెప్పడంతో ఇద్దరూ కలిసి దొంగలను వెంబడించారు. ఒడిశా రాష్ట్రంలోని పాడువ వైపు దొంగలు వెళుతూ బలియగుడ వద్ద అదుపుతప్పి పడిపోయారు. దీంతో వాహనాన్ని వదిలేసి గాయాలతోనే ఒడిశా వైపు వెళ్ళిపోయారని మత్య్సరాజు తెలిపాడు. దొంగలు వదిలేసిన వాహనాన్ని, రెండు సెల్ఫోన్లను తీసుకుని ఎంపీడీవో పూర్ణయ్య సమక్షంలో ముంచంగిపుట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో రూ.5 లక్షల నగదు దొరికింది. మిగతా సొమ్ముతో దొంగలు పరారైనట్టు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా పుటేజీలతో దొంగల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..