
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ హాట్ టాపికే. ఈ ప్రాజెక్టులో ఎంతో అవినీతి జరిగిందని.. ఎన్నో కోట్లు చేతులు మారాయని గతంలో కాంగ్రెస్, బీజేపీలు ఆరోపించాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగడం విమర్శలకు తావివ్వడంతో పాటు ప్రాజెక్టుపై అనుమానాలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళ్వేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశిచింది. దాంతో పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఎట్టకేలకు విచారణకు పూర్తవడంతో నివేదిక ప్రభుత్వానికి చేరింది. గురువారం నివేదిక నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు కమిషన్ అందజేసింది. ఇవాళ ఈ నివేదిక సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో అధికారులు సీఎంకు నివేదికను అందజేశారు.
ఈ క్రమంలో నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తెలిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. మరోవైపు మంత్రులు, సీఎస్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి.. డీపీఆర్ మొదలు.. మేడిగడ్డ కుంగడం వరకు ఎప్పుడు ఏం జరిగింది..? ఎవరు బాధ్యులు అనే విషయాలను కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఈ క్రమంలో నివేదికపై ఏ విధంగా ముందుకెళ్లాలన్నదానిపై సీఎం రేవంత్ చర్చించారు.
దాదాపు 16 నెలల పాటు కమిషన్ విచారణ జరిపింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా మొత్తం 119 మందిని కమిషన్ విచారించింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కేబినెట్ మీటింగ్ మినిట్స్ను ప్రభుత్వం నుంచి తెప్పించుకుని మరీ పరిశీలించింది. ప్రధానంగా మూడు అంశాలను కమిషన్ నివేదికలో ప్రస్తావించింది. డిజైన్లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై నివేదిక సమర్పించింది. హైలెవల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్ చేసిట్లు నివేదికలో ప్రస్తావించారు. ఐఏఎస్లు, ఇంజినీర్ల మధ్య సమన్వయం లోపం.. క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు జరపడంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని కమిషన్ స్పష్టం చేసింది. అధికారుల తప్పిదాలపై లీగల్ అంశాలతో ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..