మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తి మొత్తం అమరావతికి రాసిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వేయికోట్లు ఆస్తి కూడబెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై సిట్టింగ్ జడ్డితో విచారణకు సిద్ధమని.. నిజమని తేలితే ఆ ఆస్తి మొత్తం అమరావతికి రాసిస్తానంటూ అనిల్ కుమార్ యాదవ్ ఛాలెంజ్ చేశారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం తనపై తప్పుడు ప్రచారం చేయిస్తోందని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారం కేసులు పెట్టి వేధిస్తున్నారని.. విదేశాల్లో ఆస్తులు కొన్నట్లు ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి అక్రమాస్తులను కూడబెట్టుకోలేదని.. ఆఫ్రికాలో తనకు మైనింగ్స్ ఉన్నాయనేది అబద్ధపు ప్రచారమని కొట్టిపారేశారు. తనపై చేస్తున్న ఆరోపణల మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. 2008 కంటే ముందు ఉన్న ఆస్తులు.. ఇప్పుడు ఉన్న ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. తన వద్ద వేలకోట్లు ఉన్నాయని నిరూపించిన పక్షంలో.. ఆ ఆస్తి మొత్తం అమరావతికి రాసిస్తానంటూ అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీ ఇష్టం.. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా: మాజీ మంత్రి అనిల్
మరోవైపు తనకు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి గతంలో మనస్ఫర్ధలు ఉండేవని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. తామిద్దరం కలిసి మైనింగ్ వ్యాపారం చేసినట్లు వాంగ్మూలంలో రాశారని.. మనస్పర్థలు ఉంటే ఎలా కలిసి వ్యాపారం చేస్తామని ప్రశ్నించారు. ఇక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరు అవుతానని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఆగస్ట్ నాలుగో తేదీ విచారణకు హాజరవుతానని… జైలుకు పంపాలని వారు నిర్ణయించుకున్నా తాను సిద్ధమంటూ అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.