విజయవాడ-హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రూట్లో ప్రస్తుతం ఉన్న రహదారిని ఆరు లేన్లకు విస్తరించే పనులు జరుగుతున్నాయని.. ఇది పూర్తయితే ప్రయాణ సమయం రెండున్నర గంటలకు తగ్గుతుందని చెప్పుకొచ్చారు. అలానే ఏపీలో రూ.2.5 లక్షల కోట్ల రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. వచ్చే రెండేళ్లలో ఏపీ రోడ్లు అమెరికాకు సమానంగా ఉంటాయని నితిన్ గడ్కరీ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం..
హైలైట్:
- విజయవాడ- హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే..
- సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం
- ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

మంగళగిరిలో శనివారం నిర్వహించిన జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినట్లుగానే రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. నాయకత్వం బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందడుగేస్తోందని తెలిపారు. ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు దార్శనికత, ఆలోచనను అభినందిస్తున్నారు. విజన్ అంటే ఏంటో దేశానికి చూపించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు.
నీరు, కమ్యూనికేషన్, విద్యుత్తు, రవాణా వంటి రంగాల్లో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే.. మరికొన్ని సంవత్సరాల్లో.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1, రెండో స్థానాల్లో నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదన్నారు నితిన్ గడ్కరీ. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో మన దేశ రైతులు అన్నదాతలే కాదు ఇంధన దాతలు కూడా అయ్యారని చెప్పుకొచ్చారు. అలానే రానున్న రోజుల్లో రైతు బిటుమిన్ దాత కూడా కాబోతున్నారని తెలిపారు. ఇప్పటికే వరిగడ్డితో తయారు చేసే బిటుమిన్ ద్వారా నాగపూర్-జబల్పుర్ నేషనల్ హైవేలో కిలోమీటరు రహదారిని నిర్మించామని చెప్పుకొచ్చారు.