Stree Shakti Scheme from August 15 in Andhra Pradesh: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ఆగస్ట్ 15 నుంచి స్త్రీ శక్తి పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6700 బస్సులలో ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం జరిగే ఏపీ కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 6700 బస్సులు కేటాయించినట్లు వివరించారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు కారణంగా ఏపీ ప్రభుత్వ ఖజానాపై రూ.1950 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం రోజున ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీయై.. స్త్రీ శక్తి పథకం అమలుపై చర్చించింది. స్త్రీ శక్తి పథకం విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉంది. మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం మార్గదర్శకాలు, విధివిధానాలను కేబినెట్ భేటీలో చర్చించిన అనంతరం ఆమోదం తెలపనున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వలన ప్రయోజనాలు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం ద్వారా వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల సేవింగ్స్ పెరగటంతో పాటుగా సామాజికంగానూ ప్రభావం చూపించనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఉద్యోగాలు చేసే మహిళల నెలవారీ రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. ఈ మొత్తాన్ని చిన్నారుల సంరక్షణ, విద్య, ఆరోగ్యం, అత్యవసర నిధి, ఇంటి నిర్వహణ వంటి పనులకు ఉపయోగించుకోవచ్చు.
అమరావతిని సింగపూర్ చేయడమే చంద్రబాబు ధ్యేయం.. అదే పర్యటన ఉద్దేశం: రాంప్రసాద్ రెడ్డి
అలాగే మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రావటంతో మహిళలు ఉద్యోగం, వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలవుతుంది. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి రంగాలలో.. మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. దీని కారణంగా ఆర్థికాభివృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆర్థికంగా మహిళలు వారి సొంతకాళ్లపై నిలదొక్కుకోవటంతో మహిళా సాధికారతకు తోడ్పడుతుందని చెప్తున్నారు.