
సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా… ప్రజలు ఏదో ఒక రూపంలో మోసపోతూనే ఉన్నారు. తాజాగా పార్ట్ టైం జాబ్ నమ్మి ఓ యువకుడు ఏకంగా రూ.15.16 లక్షలు నష్టపోయాడు. విజయవాడకు సమీపంలోని నున్న గ్రామానికి చెందిన ఓ యువకుడికి.. కరిష్మా బాటిల్ అనే టెలిగ్రామ్ అకౌంట్ నుంచి పార్ట్టైం ఉద్యోగానికి సంబంధించిన మెసేజ్ వచ్చింది. అలాగే ఎన్జెడ్ గోల్డ్ మర్చంట్ కంపెనీ పేరిట వాట్సాప్లో కూడా సంబంధిత సమాచారం వచ్చింది. పని పెద్దగా ఏం ఉండదనీ, బంగారానికి సంబంధించిన వేలంలో పాల్గొనడమే టాస్క్ అని చెప్పడంతో, ప్రస్తుతం ఉద్యోగం లేని ఆ యువకుడు కొంతకాలంపాటు టైం పాస్కు ఈ జాబ్ చేస్తే నష్టం ఏముంటుంది అని ఆలోచించాడు.
ఆ మెసేజ్ నమ్మి కాంటాక్ట్ అయిన యువకుడిని సైబర్ మాయగాళ్లు టార్గెట్ చేశారు. మొదట చిన్నచిన్న లింకులు పంపించి రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత ఫేక్ వేలాలు నిర్వహిస్తూ వాటిలో పాల్గొనాలని చెప్పారు. వాటిలో పాల్గొనడం ద్వారా కొన్ని వందల రూపాయలు ఆ యువకుడి అకౌంట్లో పడుతుండడంతో అతడు నిజంగానే డబ్బు వస్తోందని నమ్మేశాడు. అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మాయగాళ్లు మెల్లిగా పెట్టుబడి పెంచమని సూచించారు. ఇంకాస్త ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది అనే చెప్పడంతో.. యువకుడు ఆశపడి మళ్లీ.. మళ్లీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాడు. 17 బ్యాంక్ ఖాతాల్లో మొత్తంగా రూ. 15,16,513 జమ చేశాడు.
చివరకు వారి యాప్ పని చేయకపోవడం మొదలై, ఎవరూ ఫోన్ ఎత్తకపోవడంతో తనను మోసగించినట్లు యువకుడు గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..