
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తారని, ఆయన పర్యటన కోసం ప్రస్తుతం తేదీలు ఖరారు అవుతున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలోని మాస్కో పర్యటనలో ఉన్న ఆయన రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుతిన్ రాక కోసం భారత్ ఉత్సాహంగా ఎదుచూస్తుందని అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పర్చేందుకు మంచి మార్గంగా మారుతుందన్నారు. భారత్, రష్యా మధ్య చాలా ప్రత్యేకమైన, సుదీర్ఘ సంబంధం ఉన్నాయని ఆయన అన్నారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నామని ఆయన అన్నారు.
గత ఏడాది ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ రెండుసార్లు కలిశారు.
అయితే ఇప్పటికే గత సంవత్సరం ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ రెండుసార్లు కలుసుకున్నారు. జూలైలో 22వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ మాస్కోకు వెళ్లిన సమయంలో ఒకసారి. అక్టోబర్లో కజాన్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైనప్పుడు రెండోసారి మోదీ, పుతిన్ సమావేశమయ్యారు.
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల మధ్య పుతిన్ భారత పర్యటన
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. భారత దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. శుక్రవారం నాటికి ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి మాస్కో అంగీకరించకపోతే, రష్యన్ ముడి చమురు కొనుగోలుదారులపై ద్వితీయ ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు బెదిరించారు. దీంతో భారతదేశం రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోదీ, పుతిన్ మధ్య ట్రంప్ తారిఫ్పై చర్చలు జరుగతాయని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.