హైదరాబాద్, ఆగస్ట్ 8: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) రాత పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం గేట్ పరీక్షకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది ఆగస్టు 25, 2025 నుంచి సెప్టెంబర్ 25, 2025వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించన్నట్లు ఐఐటీ గువాహటి తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన అధికారికంగా నోటిఫికేషన్ త్వరలోనే విడుదలకానుంది.
ఇప్పటికే గేట్ 2026 కొత్త వెబ్సైట్ను కూడా డిజైన్ చేసి.. అందులో ప్రవేశ పరీక్ష వివరాలను అందుబాటులో ఉంచింది. ఆలస్య రుసుంతో అక్టోబర్ 6, 2025వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఒక్కో టెస్ట్ పేపర్కు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000, ఇతర కేటగిరీలు, విదేశీ విద్యార్థులు రూ.2000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
ఇక గేట్ 2026 ఆన్లైన్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష మూడు గంటల పాటు జరగనుంది. గేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మార్చి 19, 2026న విడుదల చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ తేదీల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు ఐఐటీ గువాహటి వెల్లడించింది. ప్రస్తుత ఏడాదిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
ఒకవేళ ఎవరైనా రెండు పేపర్లు రాయాలనుకుంటే.. ఒకే ఫారమ్లో ఆ వివరాలు నింపాల్సి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే మాత్రం వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. అలాగే ఆయా పేపర్లకు చెల్లించిన ఫీజును కూడా రిఫండ్ చేయరు. కాగా గేట్ స్కోర్ ఆధారంగా ఐఐటీల్లో నేరుగా పీహెచ్డీలో కూడా ప్రవేశాలు కల్పించడంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.