YS Sharmila on YSR Statue issue Nandigama: నందిగామ సెంటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై కోపం ఉంటే వైఎస్సార్ విగ్రహం ఏం చేసిందని షర్మిల ప్రశ్నించారు. అసలు వైసీపీకి, వైఎస్ఆర్కు సంబంధం లేదన్న షర్మిల.. పార్టీకి పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్పై వారిదే పేటెంట్ రైటా అంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని వెంటనే పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

“కూటమి ప్రభుత్వం వైసీపీపై కోపాన్ని వైఎస్సార్ గారి విగ్రహాల మీద చూపిస్తారా ? అసలు YCPకి YSRకి ఏం సంబంధం ? మహానేత పేరు పెట్టినంత మాత్రాన YSR ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా ? YSR గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర. సంక్షేమ పథకాల అమలులో ఈ దేశానికి దిశా నిర్దేశం YSR గారు. ప్రజాక్షేమమే పరమావధిగా చివరి దాకా పరితపించిన గొప్ప వ్యక్తి. ఇంతటి ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా ? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా ? ఇదెక్కడి దిక్కుమాలిన చర్య?” అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమన్న వైఎస్ షర్మిల.. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మరణం తర్వాత నందిగామ గాంధీ సెంటర్ వద్ద నాటి ప్రభుత్వం YSR విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వైఎస్ షర్మిల గుర్తు చేశారు.
వైఎస్సార్ విగ్రహం చుట్టూ వైసీపీ అక్రమంగా వేసుకున్న సెట్టింగులు తొలగిస్తే అభ్యంతరం లేదన్న షర్మిల.. కానీ ఇదే సాకుగా వైఎస్సార్ విగ్రహం మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీకి, వైఎస్సార్కు సంబంధం లేదన్న షర్మిల.. తొలగించిన చోటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.