
ఒక మహిళను అతి దారుణంగా హత్య చేసిన కొందరు గుర్తుతెలియని దండగులు ఆమె శరీరభాగాలను కిలీమీటర్కు ఒకటిగా పది చోట్ల పడేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని తుమకారు జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం చింపుగనహళ్లిలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో తొలిసారిగా ఈ సంఘటన బయటకు వచ్చింది. సమీపంలోని పొదల నుండి తెగిపోయిన చేతిని రోడ్డుపైకి లాగుతున్న ఒక వీధి కుక్కను చూసిన స్థానికులు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. కుక్కనోటిలో ఉన్నది మానవుడి చెయి కావడంతో వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇంకాస్త ముందుకెళ్లి చూడగా వాళ్లకు ప్లాస్టిక్ కవర్లో చుట్టబడిన మరొక చేయి కనిపించింది. దీంతో, భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
10 చోట్ల బాధితురాలి శరీరబాగాలు గుర్తింపు !
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది దారుణ హత్య కాదని గుర్తించారు. మహిళను ముక్కలుగా నరికి హత్య చేసినట్టు ప్రాథమికంగా అంచనావేశారు. మహిళ మిగతా శరీర భాగాల కోసం సమీప ప్రదేశం మొత్తం వెతికారు. ఇలా కొన్ని గంటల్లో, పోలీసులు అనేక ప్రదేశాల నుండి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. లింగపుర రోడ్ వంతెన సమీపంలో ప్రేగుల భాగాలు, బెండోన్ నర్సరీ సమీపంలో కడుపు, ఇతర అంతర్గత అవయవాలు, జోనిగరహళ్లి సమీపంలో రక్తంతో తడిసిన బ్యాగ్తో పాటు ఒక కాలును స్వాధీనం చేసుకున్నారు. సిద్దరబెట్ట, నెగలాల్ మధ్య రోడ్డులో రెండు సంచులలో మరిన్ని శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం, సిద్దరబెట్ట సమీపంలో బాధితురాలి తలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద, కొరటగెరె, కోలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వచ్చే 10 ప్రదేశాల నుండి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
టాటూ ద్వారా బాధితురాలి గుర్తింపు
దర్యాప్తు తర్వాత, చేతులు, ముఖ కవళికల మీద ఉన్న పచ్చబొట్లు ఆధారంగా, పోలీసులు బాధితురాలిని తుమకూరు తాలూకాలోని బెల్లావి గ్రామానికి చెందిన లక్ష్మీదేవమ్మ (42) గా గుర్తించారు. ఆగస్టు 4 నుండి ఆమె కనిపించకుండా పోయిందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె భర్త ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. లక్ష్మీదేవమ్మ ఆగస్టు 3న తన కుమార్తెను చూడటానికి ఉర్డిగెరెకు వెళ్లిందని.. కానీ ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసి, ముక్కలు ముక్కలుగా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానిక పోలీసులను ఉలిక్కిపడేలా చేయడంతో పాటు కొరటగెరె తాలూకాలోని ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఈ దారుణ హత్య వెనుక గల కారణం, హంతకులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని కర్ణాటక పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.