గుంటూరులో శంకర్ విలాస్ వంతెన కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. సుమారుగా 70 ఏళ్ల పాటు ఈ వంతెన మీదుగా నగరవాసులు రాకపోకలు సాగించారు. అయితే నగరం విస్తరించడం. ట్రాఫిక్ రద్దీ కారణంగా పాత వంతెన స్థానంలో నాలుగు వరుసల ఆర్వోబీ నిర్మించనున్నారు. రూ.98 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి కూల్చివేతలు ప్రారంభం కాగా.. స్థానికులు పాత వంతెనతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

శంకర్ విలాస్ ఫ్లైఓవర్ విషయానికి వస్తే.. 1958లో అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 50 ఏళ్ల అవసరాలను తీర్చేలా దీనిని నిర్మించారు. అయితే ఈ వంతెన సుమారుగా 67 ఏళ్లపాటు సేవలు అందించింది. దీనిపై నిత్యం 50 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగించేవి. శంకర్ విలాస్ వంతెన నిర్మాణం తర్వాత పశ్చిమం వైపు గుంటూరు భారీగా విస్తరించింది.
అలాగే వంతెనకు రెండు వైపులా ఆర్థికంగా గుంటూరు వృద్ది చెందింది. ఇదే సమయంలో శంకర్ విలాస్ వంతెన శిథిలస్థితికి చేరుకుంది. దీనికి తోడు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ కావటంతో నూతన ఆర్వోబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 98 కోట్లతో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకోసం 134 మంది నుంచి స్థలాలు కూడా సేకరించారు. స్థలం విలువకు నాలుగు రెట్లు చేసే టీడీఆర్ బాండ్లు అందించారు.
మరోవైపు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ను తొలుత ఆరు లేన్లుగా నిర్మించాలని భావించారు. ఆ తర్వాత నాలుగు వరుసల ఆర్వోబీగా ఖరార చేశారు. ఫ్లైఓవర్ ఎత్తు 11.5 మీటర్లు, పొడవు 930 మీటర్లతో దీనిని నిర్మించనున్నారు, మొదట ఆర్వోబీ, ఆ తరువాత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. రెండేళ్లలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే శంకర్ విలాస్ పాత వంతెన కూల్చివేత పనులు శనివారం ప్రారంభించారు.
అయితే గుంటూరులో ఒక ఐకానిక్ నిర్మాణంగా ఉన్న శంకర్ విలాస్ వంతెన కూల్చివేతతో, స్థానికులు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. గుంటూరు నగరాభివృద్ధిలో చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిన శంకర్ విలాస్ వంతెన వద్ద తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.