
నేటి యువత అధిక ఒత్తిడి, ఆందోళనతో చిత్తవుతున్నారు. ఈ మానసిక సమస్యలు దీర్ఘకాలంలో ప్రాణాంతకం అవుతాయి. కానీ ఈ ఒత్తిడి, ఆందోళన నుంచి సహజ మార్గాల్లో ఉపశమనం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేటి కాలంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమై పోయింది. ఈ సమస్యలు చిన్న వయస్సులోనే వెంటాడుతున్నాయి. మన దేశంలో 74% మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. 84% మంది ఆందోళనతో బాధపడుతున్నారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నిద్ర, మానసిక స్థితి, మొత్తం జీవనశైలిపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి, మనస్సును ప్రశాంతపరచడానికి కొన్ని సహజ చిట్కాలను ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ జీవనశైలి సమస్యలను మీ ఇంట్లో ఉండే ఈ ఒక్క ఆకుతో పరిష్కరించవచ్చట. ఆయుర్వేదంలో, తులసిని మూలికల రాణి అని పిలుస్తారు. ఇది అడాప్టోజెన్. కాబట్టి, ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను, ముఖ్యంగా కార్టిసాల్ను సమతుల్యం చేస్తుంది. నేపాల్, ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనలలో తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గి, నిద్ర మెరుగుపడుతుందని తేలింది.
తులసిని ప్రతిరోజూ ఎలా ఉపయోగించాలంటే..
తులసి టీ తాగడం ఆరోగ్యానికి ఉత్తమం. ఒక కప్పు నీటిలో 5-7 తులసి ఆకులను మరిగించి, కొద్దిగా అల్లం, దాల్చిన చెక్క వేసి 5 నిమిషాలు మరిగించి ఆ తర్వాత తాగాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. అలాగే తులసి కషాయాన్ని కూడా తయారు చేసి తాగవచ్చు. ఇందుకు 2 కప్పుల నీటిలో 10-12 తులసి ఆకులు, అల్లం, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క వేసి.. దీనిని 10 నిమిషాలు మరిగించి, వడకట్టిన తాగాలి. ఇది కొద్దిగా కారంగా ఉంటుంది. కానీ తక్షణ ప్రభావాన్ని ఇస్తుంది. దీనితో పాటు, ఉదయం ఖాళీ కడుపుతో 4-5 తులసి ఆకులను నమలవచ్చు. అయితే ప్రతిరోజూ ఇలా చేయడం మంచిదికాదు. ఎందుకంటే తులసి నోట్లో దంతాలను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని లైఫ్స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.