హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటించారు. బల్కంపేటలో ముంపు ప్రభావిత కాలనీలను ఆకస్మికంగా సందర్శించిన సీఎం.. వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, మునిసిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోసారి హైదరాబాద్పై కుండపోత వాన కురిసే అవకాశముండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్లో వర్షాలపై మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు.
ఇదిలావుంటే, మూడురోజులుగా హైదరాబాద్లో వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. నగర వాసులు మరోసారి కుండపోతకు సిద్ధం కావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి సహా పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు వాతావరణం కాస్త పొడిగా ఉన్నా రాత్రి వరకు వాన దంచికొడుతుందని అధికారులు చెబుతున్నారు. అకస్మాత్తుగా వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉందని, బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, వర్షం కురిసే సమయంలో భారీ హోర్డింగ్లు, చెట్ల కింద నిలబడొద్దని అధికారులు అలెర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిలిచిపోయే ప్రాంతాలను ముందుగానే తప్పించుకోవాలని, వాహనాలు తక్కువ లోతైన రోడ్లలో మాత్రమే నడపాలని జాగ్రత్తలు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..