గతేడాది భారీ వర్షాల నేపథ్యంలో వరదలో చిక్కుకొని వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ మృతి చెందిన విషయం తెలిసిందే.. అయితే.. అశ్వినీ సోదరుడు అశోక్ వారి గుర్తుగా గుడి నిర్మించి పూజలు నిర్వహించారు. పలువురిని ఆలోచింపజేసే ఈ సంఘటన ఖమ్మం జిల్లా గంగారం తండాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని, ఆమె తండ్రి నునావత్ మోతిలాలుతో కలిసి భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు.. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, పురుషోత్తమాయ గూడెం వద్ద వరద తాకిడికి కారు ఆకేరులో గల్లంతైంది.. ఈ ప్రమాదంలో కారులో ఉున్న అశ్వినితోపాటు ఆమె తండ్రి నునావత్ మోతిలాల్ మృతి చెందారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పలువురి హృదయాలను కదిలించింది. దేశానికి ఎంతో సేవ చేయాల్సిన అశ్విని మృతి చెందటం వ్యవసాయ రంగానికి ఎంతో తీరని లోటని చెప్పవచ్చు. అందుకే ఆమెకు గుర్తుగా ప్రభుత్వం కొత్త వరి వంగడాలకు కొంత కాలం అశ్వినీ పేరును పెట్టిన విషయం తెలిసిందే.
అయితే.. అశ్విని మృతి చెందినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గంగారం తండాను సందర్శించి అశ్వినీ కుటుంబాన్ని పరామర్శించారు. అయితే కుటుంబంలో ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబం సంవత్సరం గడుస్తున్నా జీర్ణించుకోలేకపోతున్నది.. బాధాతప్త హృదయాలతో ఏమి తోచనీ అయోమయ స్థితికి చేరుకుంది. అశ్విని సోదరుడు అశోక్ పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పని చేస్తున్నాడు. తన తండ్రి, సోదరీ అశ్వినిని మర్చిపోలేక తన సొంత వ్యవసాయ భూమిలోనే వారికి గుర్తుగా గుడి నిర్మించాడు. అంతేకాకుండా.. వారికి పూజలు చేశాడు.
వీడియో చూడండి..
చుట్టుపక్క గ్రామాలలో యువతీ, యువకులకు అశ్విని ఆదర్శప్రాయంగా నిలుస్తుందని.. ఆమె గుడి చూసినప్పుడల్లా ఆమెలాగా ఉన్నత స్థాయికి ఎదిగాలనే ఆలోచన వారిలో కలుగుతుందని.. అందుకే.. అశ్వినికి తండ్రి మోతిలాల్ కు గుడి నిర్మించినట్లు అశోక్ తెలిపారు. ఆ గుడిలో అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ విగ్రహాలను ప్రతిష్టించాడు. అశోక్ తల్లి నూనావత్ నేజితో పూజలు చేయించి గుడిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరంతా జనాన్ని పిలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..