తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు శుభవార్త. రాబోయే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం మరో సంక్షేమపథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా, ఇప్పుడు పిల్లలకు ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు విద్యాశాఖ అడుగులు ముందుకు వేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించినట్లుగా, తమిళనాడు నమూనాలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఉదయం అల్పాహార పథకం’ అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అధికారులు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 17.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ అల్పాహారం అందించాలంటే సంవత్సరానికి సుమారు రూ. 400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. కేవలం ఆహార ఖర్చు రూ. 360 కోట్లు కాగా, వంటసామాగ్రి, గ్యాస్ పొయ్యిలు, నిర్వహణ తదితర అంశాలతో కలిపి మొత్తం ఖర్చు రూ. 400 కోట్ల వరకు చేరుతుందని లెక్కలు చూపుతున్నాయి.
బ్రేక్ ఫాస్ట్ మెనూలో వారానికి మూడు రోజులు అన్నంతో పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడీ లాంటి వంటకాలు ఉంటాయి. మిగతా రెండు రోజులు ఉప్మా, రవ్వ కిచిడీ వంటి అల్పాహార పదార్థాలు అందించాలని అధికారులు ప్రతిపాదించారు. సగటున ఒక్క విద్యార్థి అల్పాహారానికి రోజుకు రూ. 10 ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. రోజుకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని పరిగణనలోకి తీసుకుంటే, రోజువారీ వ్యయం రూ. 1.6 కోట్లు అవుతుంది.
ప్రస్తుతం మధ్యాహ్న భోజనం వండే కార్మికులు నెలకు రూ. 3 వేలు వేతనం పొందుతున్నారు. కొత్త పథకం అమలులోకి వచ్చిన తర్వాత వారి పనిభారం పెరిగే అవకాశం ఉన్నందున, వేతనాన్ని రూ. 500 పెంచే ప్రతిపాదనను కూడా విద్యాశాఖ ప్రభుత్వం ముందుంచింది.
ఈ పథకం ద్వారా విద్యార్థుల అడ్మిషన్లు, హాజరు శాతం గణనీయంగా పెరగవచ్చని అధికారులు నమ్ముతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఇది ఒక పెద్ద ఊరటగా మారనుంది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ఈ ఉదయం అల్పాహారం పథకం 2025 జూన్ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమవనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి