అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజధానికి భూములిచ్చిన రైతులతో కాసేపు ముచ్చటించారు. అత్యాధునిక హంగులతో ఏడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో.. వివిధ విభాగాల కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. దీంతో పరిపాలన సౌలభ్యం మెరుగుపడనుంది. ఈ భవనంలో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, AI కమాండ్ సెంటర్, మీటింగ్ హాల్స్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, CRDA, ADCL విభాగాలు, ఉన్నతాధికారుల ఛాంబర్లు కూడా ఉన్నాయి.
హైలైట్:
- అమరావతిలో సీఆర్డీఏ భవనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- అత్యాధునిక హంగులతో ఏడు అంతస్తుల్లో రూపుదిద్దుకున్న భవనం
- ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులతో ముచ్చటించిన సీఎం

భవనం ప్రత్యేకతలివే..
సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అత్యాధునిక హంగులతో ఏడు అంతస్తుల్లో (జీ+7) నిర్మితమైంది ఈ సీఆర్డీఏ భవనం. ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. సీఆర్డీఏ సహా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలకు అనుబంధంగా ఉన్న కార్యాలయాలన్నీ ఈ నూతన భవనంలోకి మారనున్నాయి. రాయపూడి సమీపంలోని సీడ్ ఆక్సిస్ రహదారి వద్ద నిర్మించిన ఈ కార్యాలయ భవనం ముందు.. అమరావతిని ప్రతిబింబించేలా A అక్షరంతో ఎలివేషన్ ఇచ్చారు. ఇందులో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, AI కమాండ్ సెంటర్, మీటింగ్ హాల్స్ , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, CRDA, ADCL విభాగాలు, ఉన్నతాధికారుల ఛాంబర్లు కూడా ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ భవనం మొదటి అంతస్తులో మీటింగ్ హాల్స్.. 2, 3, 5 అంతస్తుల్లో సీఆర్డీఏ, నాలుగో ప్లోర్లో సీడీఎంఏ పురపాలక డైరెక్టరేట్ కార్యాలయం ఉటుంది. ఆరో అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ఇక భవనం పైకప్పుపై ప్రీ-ఇంజినీర్డ్ డైనింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో.. మరో 4 భవనాలు నిర్మించారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది. కాగా ఇంతకుముందు వరకు సీఆర్డీఏ కార్యాలయం విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగించింది. ఇప్పుడు సీఆర్డీఏ భవనం పూర్తి కావడంతో.. వివిధ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండనున్నాయి. ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందించే వీలు ఉంటుంది. ఇక రాజధాని అభివృద్ధి పనుల పునరుద్ధరణ కూడా వేగంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.