ఆంధ్రప్రదేశ్ను ఏఐ హబ్గా మార్చేందుకు విశాఖపట్నంలో కీలక ముందడుగు పడింది. వైజాగ్లో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలోని తాజ్మాన్సింగ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఒప్పందంపై ఇరు వర్గాల ప్రతినిధులు సంతకాలు చేశారు. దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అసియాయాలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మించనుంది గూగుల్. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2028-2032 మధ్య రాష్ట్ర జీడీపీకి ఏటా రూ.10,518 కోట్లు, 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనాలు ఉన్నాయి.
హైలైట్:
- ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం
- విశాఖలో ఏఐ డేటా సెంటర్ నిర్మించనున్న గూగుల్
- రూ.88 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న గూగుల్

1.88 లక్షల ఉద్యోగాలు..!
విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు ఈ ఒప్పందం పునాది వేయనుంది. సుమారు 10 బిలియన్ డాలర్ల (రూ.88,628 కోట్ల) పెట్టుబడితో.. 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది గూగుల్. ‘గూగుల్ ఏఐ హబ్’ పేరుతో భారత్లోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు ఏపీ సర్కార్ విశాఖపట్నంలో ( google ai data center vizag ) శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028- 2032 మధ్య.. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 1,88,220 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పనకు కూడా (google data center vizag jobs) అవకాశం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎకోసిస్టమ్ మొత్తం మారిపోనుంది. వైజాగ్ ఏఐ సిటీగా మారిపోనుంది.
రాష్ట్రానికి కొత్త ఆదాయ వనరు..
ఈ డేటా సెంటర్.. ఆధునిక ఆర్థిక మౌలిక సదుపాయాలకు మూలస్తంభంగా నిలుస్తుందని ఇటీవల ప్రభుత్వం చెప్పింది. AI, క్లౌడ్ కంప్యూటింగ్, IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), 5G, ఇ-గవర్నెన్స్ ప్లాట్ఫామ్లను వేగవంతం చేస్తుందని చెప్పింది. ఈ డేటా సెంటర్ ద్వారా.. .. విద్యుత్, ఫైబర్ ఆప్టిక్స్, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్స్ వంటి అనుబంధ రంగాలకు ఊతం లభిస్తుందని పేర్కొంది. ఫలితంగా రోడ్డు, విద్యుత్, ఫైబర్ కనెక్టివిటీకి డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. ఇవన్నీ జరిగితే.. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఆస్తి పన్ను, SGST ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఏఐలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ గతేడాది అక్టోబర్ 31న అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భందగా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అనంతరం విశాఖలో పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించనున్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదే కావడం గమనార్హం. అయితే ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి.. యువతలో ఏఐ నైపుణ్యాభివృద్థికి వివిధ కార్యక్రమలను ప్రభుత్వం అమలు చేయనుంది.