ఆడ వాళ్ల పేర్లతో మెసేజ్లు పెడుతుంటాడు. కాల్ బాయ్గా పనిచేస్తే మంచి డబ్బులిస్తారని నమ్మిస్తాడు. అతని మాయ మాటల్లో పడటానికి గొంతు మార్చి ఏమారుస్తాడు. రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు గుంజుతాడు. అ తర్వాత అతనే పోలీసు అవతారం ఎత్తి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కేసులు నమోదు చేస్తామని భయపెట్టి అందిన కాడికి దండుకుంటాడు. ఇలాంటి మోసగాడిని గుంటూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన చైతన్య కృష్ణ డిప్లొమా పూర్తి చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. ఫేస్ బుక్లో శైలజ, సునీత, నీలిమ పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసి అబ్బాయిలకు ప్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంటాడు. వారు యాక్సెప్ట్ చేయగానే సందేశాలతో యాక్షన్లోకి దిగుతాడు. తర్వాత పరిచయం పెంచుకుని కాల్బాయ్గా పనిచేస్తే మంచిగా డబ్బులు వస్తాయని ఆశజూపుతాడు. కావాలంటే తన దగ్గర ఉన్న కాల్ బాయ్స్ నంబర్స్ ఇస్తానని చెబుతాడు. ఎవరైనా ఆ నంబర్స్కి ఫోన్ చేస్తే చైతన్య కృష్ణనే గొంతు మార్చి మాట్లాడతాడు. తాను కాల్ బాయ్గా చేస్తున్నానని.. బాగా డబ్బులు వస్తున్నట్లు నమ్మించేవాడు. అలా తన ట్రాప్లో చిక్కుకున్న వారి నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో ఇరవై, ముప్పై వేల రూపాయలు గుంజుతాడు. ఆ తర్వాత కొంతకాలానికే వారికి ఫోన్ చేసి మీరు మహిళలతో అసభ్యంగా మాట్లాడుతున్నారని మీపై పోలీస్ కేస్ నమోదైందని వాటి నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తాడు. ఇలా ఇప్పటివరకు అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆరు నెలల కిందట నగరంలోని ఎస్విఎన్ కాలనీలో నివాసం ఉండే అరవై ఎనిమిది ఏళ్ల వ్యక్తికి పేస్ బుక్లో మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత కాల్ బాయ్గా పనిచేయాలని సలహా ఇచ్చాడు. అయితే సదరు వ్యక్తి తనకి 68 ఏళ్ల వయస్సు అని చెప్పి తనకు అటువంటి వద్దని చెప్పి వారించాడు. అయితే పది రోజుల పాటు అతనికి మెస్సెజ్లు పంపిన చైతన్య కృష్ణ.. ఆ తర్వాత అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఆ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరించి చైతన్య కృష్ణను అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నిందితుడిపై పలు కేసులున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకూ కోటి రూపాయల వరకూ మోసం చేసినట్లు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. సోషల్ మీడియాలో తెలియని వారి నుండి ప్రెండ్ రిక్వెస్ట్లు వస్తే స్వీకరించవద్దని సలహా ఇచ్చారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..