Tirupati Police Arrest,ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. తిరుపతిలో ఇద్దరు అరెస్ట్ – tirupati police arrest two for fake liquor rumors and asp ravi manohar achari warns of action
ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి హెచ్చరించారు. తిరుపతిలోని విక్టరీ వైన్స్ వద్ద జరిగిన గొడవ, కపిలతీర్థం వద్ద ఒక వ్యక్తి మద్యం తాగి పడిపోవడం వెనుక టీడీపీ తయారుచేస్తున్న కల్తీ మద్యం ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదు మేరకు ఈ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పీఏ చంద్రశేఖర్ వెంకటేష్ను ఏ1గా.. వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు బృంగి నవీన్ను ఏ2గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి మీడియాకి వెల్లడించారు. నలుగురు జీపు డ్రైవర్లు విక్టరీ వైన్స్ వద్ద తాగిన మత్తులో గొడవ పడితే.. ఉద్దేశపూర్వకంగా వెంకటేష్ వీడియో తీసి నవీన్కు పంపించాడని.. నవీన్ ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తిరుపతిలో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశాడని ఏఎస్పీ తెలిపారు. అలాగే, కపిలతీర్థం వద్ద కూడా ఓ వ్యక్తి మద్యం మత్తులో పడిపోతే.. కల్తీ మద్యం సేవించడం వల్ల పడిపోయాడని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. టెక్నికల్ అవిడెన్స్లు సేకరించిన తర్వాతే వెంకటేష్, నవీన్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు.