Andhra Pradesh Govt Lands Incentives And L:ands To Companies: ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా భూములు కేటాయించి, ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయనగరం, కర్నూలు, విశాఖపట్నం, పల్నాడు, చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ పార్కులు, డ్రోన్ తయారీ యూనిట్లు, లాజిస్టిక్స్ హబ్స్, సిమెంట్ ప్లాంట్లు, మహిళా పారిశ్రామిక వాడలు వంటివి రానున్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
హైలైట్:
- ఏపీకి భారీగా కంపెనీలు, పెట్టుబడులు
- భూములు, ప్రోత్సాహకాలు ఇచ్చినసర్కార్
- ఆ 4 జిల్లాల దశ తిరిగినట్లే అంటున్నారు

రిలయన్స్ పెట్టుబడులు
కర్నూలు జిల్లాలో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రూ.808.03 కోట్ల పెట్టుబడితో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఫుడ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. మొదటి దశ పనులు 2027 ఫిబ్రవరిలో, రెండో దశ పనులు 2029 మార్చిలో పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద, సంస్థ స్థిర మూలధన పెట్టుబడిపై ఐదేళ్లలో రూ.298.70 కోట్లు (39.40 శాతం) రాయితీ కోరింది.
కర్నూలులో యాక్సెల్ ఈఎస్జీ డ్రోన్ల తయారీ యూనిట్
కర్నూలు జిల్లాలో డ్రోన్లు, సెన్సర్లు, బయోచార్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యాక్సెల్ ఈఎస్జీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం 80 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ యూనిట్ మొదటి దశలో రూ.75 కోట్ల పెట్టుబడులు పెట్టి, 700 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రభుత్వం ఎకరా రూ.లక్ష చొప్పున రాయితీ ధరకు భూమిని ఇచ్చేందుకు అనుమతించింది. మొత్తం మూడు దశల్లో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టి, 3,000 మందికి ఉపాధి కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. యాక్సెల్ ఈఎస్జీ సంస్థ కర్నూలు జిల్లాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తయారీ యూనిట్ను స్థాపించనుంది. బయోచార్ అంటే వ్యవసాయ వ్యర్థాలను కాల్చి తయారు చేసే ఒక రకమైన బొగ్గు. ఇది నేల సారాన్ని పెంచడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
విశాఖపట్నం లాజిస్టిక్స్ హబ్
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని గుర్రంపాలెంలో అవంతి వేర్హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.319.75 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక, లాజిస్టిక్స్ హబ్ను ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రభుత్వం ఎకరానికి రూ.80 లక్షల రాయితీ ధరతో 20 ఎకరాల భూమిని దశలవారీగా కేటాయించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి, ఆమోదం తెలిపింది. ఈ భూమిని పారిశ్రామిక, లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు కోసం అవంతి వేర్హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారీ పెట్టుబడులు వస్తాయి.
మరికొన్ని కంపెనీలు, పెట్టుబడులు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలో మహిళా శక్తి భవన్, మహిళా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఎలీప్) సంస్థకు 30 ఎకరాల భూమిని ఎకరం రూ.10 లక్షల చొప్పున కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.36.35 కోట్ల పెట్టుబడితో 3వేల మంది మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఎలీప్ ప్రతిపాదనలు సమర్పించింది. మహిళలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు.
శ్రీ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ పల్నాడు జిల్లా పెదగర్లపాడు, ఇనుపరాజుపల్లె గ్రామాల్లో రూ.2,260 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ ప్రాజెక్టులో క్యాపిటివ్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది. దీని ద్వారా 350 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. స్థిర మూలధన పెట్టుబడిలో 39 శాతం సబ్సిడీని పదేళ్లపాటు అందిస్తుంది. అలాగే, ఏడేళ్ల పాటు యూనిట్కు రూపాయి చొప్పున రూ.86.55 కోట్ల వరకు విద్యుత్ సుంకం మినహాయింపు కూడా లభిస్తుంది.
‘నాలాగే’.. పెమ్మసానిపై చంద్రబాబు ప్రశంసలు
కర్నూలు జిల్లాలో పుట్టగొడుగుల యూనిట్, ఫుడ్ పార్క్, చిత్తూరు జిల్లాలో రిఫైన్డ్ ఆయిల్స్, సోయా మిల్క్ యూనిట్, ఏలూరు జిల్లాలో క్రూడ్ పామ్ కర్నెల్ ఆయిల్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేయనున్న సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.33.50 కోట్ల పెట్టుబడితో పుట్టగొడుగుల తయారీ యూనిట్ను స్థాపించనుంది. అదే జిల్లాలో ఆర్సీపీఎల్ సంస్థ రూ.758 కోట్ల భారీ పెట్టుబడితో ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయనుంది. చిత్తూరు జిల్లాలో ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.201.98 కోట్ల పెట్టుబడితో రిఫైన్డ్ ఆయిల్స్, సోయా మిల్క్ తయారీ యూనిట్ను నెలకొల్పనుంది. ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ రూ.208.77 కోట్ల పెట్టుబడితో క్రూడ్ పామ్ కర్నెల్ ఆయిల్ రిఫైనరీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తుంది.