పెట్టుబడులకు విశాఖపట్నం గమ్యస్థానంగా మారుతోంది. గూగుల్, టీసీఎస్, కాగ్నింజంట్, యాక్సెంచర్ వంటి ఐటీ దిగ్గజాలతో.. పాటు స్టీల్, ఎనర్జీ రంగాల్లో కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైజాగ్ పరిధిలో దాదాపు రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ, డేటా సెంటర్లకు కేంద్రంగా మారతున్న విశాఖలో.. భవిష్యత్తులో మరో హైటెక్ సిటీ తరహా అత్యాధునిక నగరం అవతరించడం ఖాయం అనే అభిప్రాయాలు .
హైలైట్:
- ఏపీలో మరో హైటెక్ సిటీ ఖాయమా..!
- విశాఖకు క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు
- విశాఖ పరిధిలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు

విశాఖలో మరో హైటెక్ సిటీ ఖాయమా?
విశాఖ ఐటీ, డేటా సెంటర్ల హబ్గా మారనుంది. సాఫ్ట్వేర్తో పాటు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయి. టీసీఎస్ (రూ. 1370 కోట్లు), కాగ్నిజెంట్ (రూ. 1583 కోట్లు), యాక్సెంచర్ (రూ. 1200 కోట్లు), ఏఎన్ఎస్ఆర్ (రూ. 1000 కోట్లు), సత్వ డెవలపర్స్ (రూ. 1500 కోట్లు) (sattva group visakhapatnam investment ), ఫీనమ్ (207), పీపుల్ ఉర్సా (రూ. 5278 కోట్లు) పెట్టుబడువు పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలను కొలువైతే.. భవిష్యత్తులో విశాఖలో మరో హైటెక్ సిటీ రూపుదిద్దుకోవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐటీ హబ్ టు స్టీల్ ప్లాంట్..
విశాఖపట్నం కేవలం ఐటీ హబ్గానే కాకుండా.. స్టీల్ హబ్గా కూడా మారబోతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రభుత్వ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా అర్సెలార్మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ (ArcelorMittal Nippon Steel India) కంపెనీ కూడా రాజయ్యపేట ప్రాంతంలో స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టులను నిర్మిస్తోంది. దీనికోసం రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టిన ఎన్టీపీసీ.. విశాఖ ప్రాంతంలోని పూడిమడకలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ పరిధిలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ పెట్టుబడులే కాకుండా.. రాంబిల్లిలో న్యూక్లియర్ సబ్మెరైన్ బేస్, భోగాపురం విమానాశ్రయం, మూలపేట పోర్టు, జీఎంఆర్ యూనివర్సిటీ, ఫార్మా పార్కు ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అంతేకాకుండా పర్యటకులను ఆహ్వానించేందుకు స్టార్ హోటల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం మాస్టర్ప్లాన్ రోడ్లు, ఫ్లైఓవర్లు, కోస్టల్ కారిడార్, రైల్వే జోన్, మెట్రో.. వంటి రవాణా సౌకర్యాలను కూడా మెరుగుపరిచేందుకు ప్రణాళికలు వేస్తోంది.
విశాఖ ఎందుకు..?
ముఖ్యంగా ఐటీ విషయానికొస్తే.. మన డేటా, మన దేశంలోనే నిల్వచేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో భారత్లో మంచి బిజినెస్ చేస్తున్న టెగ్ దిగ్గజాలు.. మన డేటాను ఇక్కడే స్టోర్ చేయడం అనివార్యమైంది. దీంతో భారత్లో డేటా సెంటర్లకు డిమాండ్ పెరిగింది. అయితే అలాంటి కంపెనీలను విశాఖపట్నం ఆకర్షిస్తోంది. చాలా తక్కువ ధరకే భూములు లభించడం, విద్యుత్, నీరు కూడా సరఫరా ఉండటం కలసి వస్తోంది. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీకి విస్తృత అవకాశాలు ఉన్నాయి. కంపెనీలు రాష్ట్రంలో ఎక్కడైనా సొంతంగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేసుకుని.. తక్కువ ఖర్చుతో గ్రిడ్ ద్వారా డేటా సెంటర్లు సరఫరా చేసుకోవచ్చు. సముద్ర జలాలను కూడా డీసాలినేషన్ చేసి వాడుకునే వీలుంది. డేటా సెంటర్లకు అవసరమైన హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్స్ను సముద్ర మార్గంలో సింగపూర్, అమెరికా వంటి దేశాలను నుంచి విశాఖకు తీసుకురానున్నారు. అంతేకాకుండా ఐటీకి ఉపయోగపడే నైపుణ్యం కలిగిన మానవవనరులు కూడా సమృద్ధిగా ఉండటంతో విశాఖపై ఆసక్తి కనబరుస్తున్నాయి.