ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఉప్పాడ హార్బర్ నిర్మాణ పనుల వల్ల మత్స్యకారుల బోట్లు దెబ్బతిన్నాయి. ఇటీవల పవన్ ఉప్పాడ ప్రాతంలో పర్యటించారు. ఈ మేరకు తన సమస్యలను మత్స్యకారులు ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాము నష్టపోయామని.. తమకు పరిహారం రాలేదని చెప్పారు. దీంతో ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు.. మత్స్యకారులకు తాజాగా రూ. 72 లక్షల పరిహారం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
హైలైట్:
- మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..
- బోటు ప్రమాదాల బాధితులకు పరిహారం విడుదల
- రూ. 72 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం

ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉప్పాడ హార్బర్ డిజైన్ లోపం కారణంగా తమ బోట్లు దెబ్బ తిన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. బోటు ప్రమాదంలో నష్టపోతే ప్రభుత్వం నుంచి పరిహారం అందడం లేదని.. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. హెలికాప్టర్లో హార్బర్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్.. బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ చొరవతో ఉప్పాడ హార్బర్లో దెబ్బ తిన్న మత్స్యకారుల బోట్లకు రూ. 72 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే ఈ పర్యనటలో భాగంగా ఉప్పాడ కాలుష్యంపై 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశించారు.
దాదాపు రూ. 360 కోట్లతో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పనులు చేపట్టారు. దాదాపు 58 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. అయితే 2024 డిసెంబర్ నాటికే ఈ హార్బర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంకా పూర్తి కాలేదు. ఈ హార్బర్ పూర్తైతే.. దాదాపు 2500 మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. ఫలితంగా ఏటా 30 వేల టన్నుల నుంచి 1.10 లక్షల టన్నులకు వరకు మత్స్య ఉత్పత్తి పెరగే అవకాశం ఉన్నట్లు గతంలో వైసీపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఆ ఉత్పత్తి విలువ రూ.890 కోట్లు ఉండనున్నట్లు అంచనా ఉంది.
ఈ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో.. భారీ బోట్లు నిలుపగలిగేలా నిర్మాణం చేస్తున్నారు. అంతేకాకుండా 20 టన్నుల కెపాసిటీ కోల్డ్ స్టోరేజీలు.. భారీ ట్యూనా చేపల ఫిష్ హ్యాండ్లింగ్ ప్యాకింగ్ షెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోల్ బంకు, జెట్టీలు, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు, ప్యాకింగ్ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం, వలలు అల్లుకునే షెడ్లు, ఐస్ ప్లాంట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.