Samayam Telugu•
ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం రాజకీయంగా రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. కల్తీ మద్యం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై అటు టీడీపీ , ఇటు వైసీపీ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన జనార్ధన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ మీద కూడా ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం ఇంత సీరియస్గా సాగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ షాపుల వద్ద మద్యం అమ్మకాలకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.

మరోవైపు నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం యాప్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ పేరుతో మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చింది.ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలా స్కాన్ చేయగానే ఆ మద్యం ఎక్కడ తయారైంది, ఎటు నుంచి ఎటు వెళ్లిందనే వివరాలు తెలుస్తాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ షాపులు. బార్ల వద్ద మద్యం బాటిల్ స్కాన్ చేయడం తప్పనిసరి. అమ్మేముందు లిక్కర్ షాపు యజమానులు మద్యం బాటిల్ స్కాన్ చేసిన తర్వాతనే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే తమ వద్ద విక్రయించే మద్యం.. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నాణ్యమైనది, నిజమైనదని ధ్రువీకరించాం.. అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ నిబంధనలు విధించింది.
జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారుచేశా: జనార్దన్ రావు
మరోవైపు మద్యం అమ్మకాలు జరిపే ముందు లిక్కర్ బాటిల్పైన సీల్, క్యాప్, హోలోగ్రామ్ వంటి అంశాలను పరిశీలించాలని నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే ప్రతీ లిక్కర్ షాపు, బార్లలోనూ తప్పనిసరిగా ఓ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రిజిస్టర్లో ఆ రోజు అమ్మిన లిక్కర్ బ్రాండ్లు, బ్యాచ్ నంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ ఎప్పుడు తనిఖీ చేశారు వంటి వివరాలను కూడా ఈ రిజిస్టర్లో నమోదు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ.. లిక్కర్ షాపులు, బార్ల యజమానులను ఆదేశించింది. అలాగే ఎక్సైజ్ సిబ్బంది ర్యాండం విధానంలో ప్రతిరోజూ తనిఖీలు చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తనిఖీ తర్వతా ఆ వివరాలను సదరు ఎక్సైజ్ అధికారి రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతి లిక్కర్ షాపు, బార్లోని మద్యం బాటిళ్లలో కనీసం ఐదు శాతాన్నైనా స్కాన్ చేయాలనే రూల్ విధించింది. నకిలీ మద్యం ప్రజలు పిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసే పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది.