నవమాసాలు మోసిన కన్నతల్లిని, ముద్దుగా పెంచిన తండ్రిని కన్న కొడుకే రోడ్డున పడేశాడు. కడదాకా తోడుగా ఉంటాడనుకుంటే, ఆస్తులు రాయించుకున్న తర్వాత వదిలేయడంతో, ఆ వృద్ధాప్యంలో నిస్సహాయ స్థితిలో అన్నమో రామచంద్ర అంటూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వృద్ధ దంపతుల ఆవేదన ఇది. కన్నబిడ్డ తీరుతో కన్నీటిపర్యంతమవుతున్న ఆ దంపతులు చివరకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్ చెందిన గుర్రాల రాజిరెడ్డి, ప్రమీల దంపతుల వయసు 70 ఏళ్లు పైమాటే. ఈ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. వారికి వివాహాలు జరిపించిన తర్వాత, తమకున్న ఆరెకరాల భూమిని పదేళ్ల క్రితమే కొడుకు గుర్రాల మహేందర్రెడ్డి పేరున రిజిస్ట్రేషన్ చేశారు. భూమి రిజిస్ట్రేషన్ అయిన కొత్తలో కొద్ది రోజులు సక్రమంగానే చూసుకున్న కొడుకు, కోడలు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు.
పింఛన్తోనే కాలం వెళ్లదీత.. !
ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.2వేలు పింఛన్లతో నే ఆ వృద్ధ దంపతులు కాలం వెళ్లదీస్తున్నారు. వయసు మీద పడటంతో ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. అనారోగ్య సమస్యలతో ఉన్నా మని, ఆసుపత్రికి తీసుకు వెళ్లమని కొడుకు, కోడలిని అడిగితే, కనీసం స్పందించకపోగా, వేధింపులకు గురిచేస్తున్నారు. బూతులు తిడుతున్నారని వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. ‘ఈ వయసులో మమ్మల్ని ఆదుకోవాల్సిన కన్నకొడుకే పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది’ అంటూ ఆ దంపతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
కొడుకు, కోడలిని పిలిపించి, తమ బాగోగులు చూసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ ఆ వృద్ధ దంపతులు పోలీసులను వేడుకుంటున్నారు. ఈ విషయంలో స్పందించిన హుజురాబాద్ సీఐ కరుణాకర్. వృద్ధ దంపతుల కుమారుడిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, వారికి భరోసా కల్పించి, వారిని పోషించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కన్నతల్లిదండ్రుల ను పోషించడం ప్రతీ కొడుకు బాధ్యత, ధర్మం అని, మానవత్వపు విలువలు మరిచి ప్రవర్తించిన ఈ కొడుకు విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..