AP Government Renamed Grama ward Sachivalayam as Swarna Gramam: ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మారనుంది. కొత్త పేరు నామకరణం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

డేటా ఆధారిత పాలనపై సమీక్ష సందర్భంగా.. గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చాలని చంద్రబాబు గతంలో సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలను విజన్ యూనిట్లుగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047 పేరుతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుంది. ఈ నేపథ్యంలో ఈ విజన్ సాకారంలో గ్రామ, వార్డు సచివాలయాలను క్రియాశీలకం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పేరును కూడా స్వర్ణ గ్రామంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ కింద వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే అందేలా ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలను తమ గ్రామంలోనే ఒకే కేంద్రంలో పొందేలా అవకాశం కల్పించారు.
మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకువచ్చింది. జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో మూడు అంచెల వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కూడా చేపడుతోంది. తాజాగా పేరును మార్చాలని నిర్ణయం తీసుకుంది.


