ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ వైఎస్ రాజారెడ్డి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పీవీ సునీల్ కుమార్ రాజారెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజారెడ్డి చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతారని అన్నారు. అలాగే ఆయన వద్ద తప్పును తప్పని చెప్పే మంచి నీతి ఉందన్నారు. అప్పట్లో జరిగిన పలు విషయాలను ఈ సందర్భంగా పీవీ సునీల్ కుమార్ పంచుకున్నారు.

తనకు ఏఎస్పీగా కడప జిల్లా పులివెందులలో తొలిసారిగా పోస్టింగ్ వచ్చినట్లు పీవీ సునీల్ కుమార్ తెలిపారు. ఏదో సాధించాలనే ఉద్దేశంతో తాను పోలీస్ వృత్తిలోకి రాలేదని.. ఉద్యోగం చేయడానికి వచ్చానన్నారు. చిన్నప్పటి నుంచి హత్యలు అంటే తెలియదని.. సడన్గా కడపకు వచ్చేసరికి ఇంత చిన్న కారణాలకు కూడా చంపేసుకుంటారా అని అనిపించిందన్నారు. పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబం చాలా పవర్ ఫుల్గా ఉండేదన్న పీవీ సునీల్ కుమార్.. ప్రజల పంచాయతీలను కూడా వారే తీర్చేసేవారన్నారు.
అయితే ఉమేష్ చంద్ర గారు తనను పులివెందులకు తీసుకెళ్లారని.. అక్కడ ఎలా ఉంటుందో తనకు తెలియదని అన్నారు. ఉమేష్ చంద్ర టీమ్ కావటంతో.. తనను యాంటీ వైఎస్ కుటుంబంగా చూసేవారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన గురించి మాట్లాడారని అన్నారు. పులివెందులలో రెండేళ్లు పనిచేశానని.. పంచాయతీ ఎన్నికలను ఒక్క బైపోల్ కూడా లేకుండా నిర్వహించామన్నారు. ఉమేష్ చంద్ర, తాను ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ఇబ్బంది పడ్డారని అన్నారు.
ఈ క్రమంలోనే వైఎస్ రాజారెడ్డి గురించి పీవీ సునీల్ కుమార్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజారెడ్డి మంచి ఇంగ్లీష్ మాట్లాడుతారని పీవీ సునీల్ కుమార్ అన్నారు. రెండు మూడుసార్లు ఆయనను కలిశానని.. బాగా మాట్లాడుతారని అన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. రాజారెడ్డి వద్ద తప్పు చేస్తే తప్పని చెప్పే నీతి ఉందన్నారు. ఓసారి పేకాడుతూ వారి మనుషులు దొరికారని.. ఆ తర్వాత వారంతా వెళ్లి ఆయన వద్ద చెప్తే.. పేకాడితే అరెస్ట్ చేయక ముద్దుపెట్టుకుంటారా అని అన్నారని గుర్తు చేసుకున్నారు.


