తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఇండియా పోస్ట్ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 28 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో తెలంగాణలో 609 ఖాళీలు ఉన్నాయి. వీటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
28,740 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 609 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు పదో తరగతి పాస్ అయి ఉండాలి. టెన్త్లో తెలుగు తప్పనిసరిగా చదివి ఉండాలి.
అయితే ఈ ఉద్యోగాల ఎంపికలో ఎలాంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉండదు. అప్లై చేసుకున్నవారి టెన్త్ మార్కులను పరిగణలోకి తీసుకుని మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఎంపికైనవారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుంది.
వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. ఫిబ్రవరి 14 వరకు గడువు ఉంది. ఎంపికైనవారు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఉండదు. ఇక సైకిల్ తొక్కడం, కంప్యూటర్ నైపుణ్యం, తెలుగు రాయడం, మాట్లాడటం వంటివి వచ్చి ఉండాలి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొబైల్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.






