ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ పెద్ద దుమారం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు ఆయనను శనివారం రాత్రి అరెస్ట్ చేసి నల్లపాడు స్టేషన్కు తరలించారు. తనపై దాడులు జరగడం వల్లే ఆవేశంలో మాటలు దొర్లాయని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ.. పోలీసులు కేసు నమోదు చేసి భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు. అంబటి అరెస్టును జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

అసలేం జరిగిందంటే..
తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి వైసీపీ నేతలను విమర్శిస్తూ గుంటూరులో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని తొలగించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుండగా కొందరు అడ్డుకున్నారని.. అప్పుడే అక్కడ దూషణలు జరిగాయని సమాచారం. తనపై టీడీపీ కార్యకర్తలు రాడ్లు, కర్రలతో దాడికి ప్రయత్నించారని అంబటి ఆరోపించారు. చంపడానికి వస్తే తాను కేకలు వేశానని.. ఆ సమయంలోనే ఆగ్రహంతో కొన్ని మాటలు అన్నానని ఆయన మీడియా ముందు అంగీకరించారు.అరెస్టుకు ముందే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. నేను జైలుకు వెళ్లడానికి సిద్ధం. మీ రెడ్ బుక్కుకు నేను భయపడను’ అంటూ సవాల్ విసిరారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తుతో ఆయన ఇంటిని ముట్టడించారు. అంబటిని వజ్ర వాహనంలో ఎక్కించి తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
అంబటి రాంబాబు అరెస్టును వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. ఇది అచ్చం ‘జంగిల్ రాజ్’ (అరాచక పాలన) లా ఉందని ఆయన విమర్శించారు. లడ్డూ వివాదంలో నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి దాడులకు దిగుతోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడానికే అంబటిపై హత్యాయత్నం చేయించి.. తిరిగి ఆయననే అరెస్ట్ చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడినందుకు చట్టప్రకారమే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. అంబటి ఇంటిపై దాడి జరిగిందన్న ఆరోపణలను విచారిస్తున్నామని.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికే ముందస్తుగా అరెస్ట్ చేశామని వివరించారు. ప్రస్తుతం అంబటి రాంబాబును నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు.
అంబటి రాంబాబుపై పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్ (FIR)లు నమోదు చేశారు. పోలీసులు సుమోటోగా ఒక కేసు నమోదు చేయగా.. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ కేసుల్లో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం 126(2), 132, 196(1), 352, 351(2), 292 వంటి సెక్షన్లను చేర్చారు. సీఎంపై అసభ్యకర పదజాలం వాడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వంటి ఆరోపణల కింద ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.


