విజయ ఏకాదశి (Vijaya Ekadashi) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటి. ఇది మాఘమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఈ పవిత్ర తిథి, భక్తులకు విజయాన్ని, శాంతిని, పాప విమోచనాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు తెలియజేస్తాయి. ప్రత్యేకంగా పద్మ పురాణం(Padma Purana)లో విజయ ఏకాదశి మహిమ విశేషంగా వివరించబడింది. ఇందులో శ్రీరాముడు లంకకు వెళ్లే ముందు సముద్రాన్ని దాటేందుకు ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని సాధించాడని కథ ఉంది. అందుకే దీనిని “విజయాన్ని ప్రసాదించే ఏకాదశి” అని భావిస్తారు.
ఈ రోజు ఉపవాసం, విష్ణు నామస్మరణ, ధ్యానం చేయడం ద్వారా మనలోని అహంకారం, లోభం, దురాశ వంటి నెగెటివ్ భావనలు తొలగి ఆత్మశుద్ధి కలుగుతుందని విశ్వాసం. ముఖ్యంగా విష్ణు భగవానుని ఆరాధనకు ఈ తిథి అత్యంత శ్రేష్ఠమైనది. విజయ ఏకాదశి మనకు బాహ్య విజయమే కాక, అంతర్ముఖంగా ధర్మమార్గంలో నడిచే ఆత్మవిజయాన్ని కూడా అందిస్తుంది. భక్తి, నియమం, నిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే జీవితం విజయమయమవుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
విజయ ఏకాదశిపై నారదుడికి బ్రహ్మ దేవుడు ఏం చెప్పాడంటే..?
విజయ ఏకాదశి మహిమను స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికు వివరించినట్లు పురాణాల్లో పేర్కొంటారు. సీతాదేవిని అన్వేషిస్తూ సముద్ర తీరానికి చేరుకున్న శ్రీరాముడు, లంకకు సులభంగా చేరేందుకు మార్గం కలగాలని మహర్షి సూచన మేరకు విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని కథనం. ఆ వ్రత ప్రభావంతోనే రాముడు సముద్రంపై వారధి నిర్మించి, రావణుడును సంహరించి విజయాన్ని సాధించాడని విశ్వాసం ఉంది.
ఈ వ్రతం ఆచరించడం వల్ల జీవనంలో ఎదురయ్యే కష్టాలు తొలగి, క్లిష్టమైన సమస్యలను అధిగమించే ధైర్యం, శక్తి లభిస్తాయని నమ్మకం. తెలిసి తెలియక చేసిన పాపాలకు పరిహారం కలిగి ఆత్మశుద్ధి కలుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా కొత్త కార్యక్రమాలు ప్రారంభించేవారు, పోటీ పరీక్షలు లేదా న్యాయ వ్యవహారాల్లో విజయం కోరుకునేవారు ఈ రోజున విష్ణువును భక్తితో ఆరాధించడం శ్రేయస్కరం అని శాస్త్రోక్తంగా చెప్పబడింది.
ఏకాదశ్యాం నిరాహారః
స్థిత్వాఽహమపరేఽహని |
భోక్ష్యామి పుండరీకాక్ష
శరణం మే భవాచ్యుత ||
పుండరీకాక్షా!
ఏకాదశి నాడు నిరాహారంగా ఉండి, మరుసటి రోజున (ద్వాదశి) భోజనం చేస్తాను. ఓ అచ్యుతా! నీవే నాకు శరణు.
ఏకాదశి రోజున ఏం చేయాలి..?
ఈ ఏడాది ఫిబ్రవరి 13న విజయ ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఉపవాసంతో పాటు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల అదృష్టం పెరిగి, జీవితంలోని సమస్యలు తగ్గుతాయని విశ్వాసం.
చేయాల్సిన దానాలు..
పసుపు రంగు వస్త్రాలు పేదలకు దానం చేయాలి – సంపద, విష్ణు కృప లభిస్తాయి.
బియ్యం దానం చేయడం వల్ల ఇంటికి సుఖసంతోషాలు వస్తాయి.
నెయ్యి దానం గౌరవాన్ని పెంచుతుంది.
శ్రీమద్ భగవద్గీత, విష్ణు సహస్రనామం వంటి గ్రంథాలు దానం చేయడం శుభప్రదం.
నువ్వులు, బెల్లం దానం ఆరోగ్యం, మనశ్శాంతిని ఇస్తాయి; శని దోషాలు తగ్గుతాయి.
దానం చేయకూడనివి..
ఇనుము, నల్ల బట్టలు దానం చేయకూడదు.
సూదులు, కత్తులు వంటి పదునైన వస్తువులు ఇవ్వకూడదు.
అనర్హులకు లేదా నాసిరకం వస్తువులు దానం చేయకూడదు.
దానం చేస్తూ ఇది దేవుని సేవగా భావించడం ముఖ్యము.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

